భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఉన్న ప్రత్యేక అనుబంధంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విరాట్ కోహ్లీని తాను సొంత సోదరుడిగా భావిస్తానని, కెరీర్లోని కష్టకాలంలో ఆయన ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని వెల్లడించారు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించిన పాడ్కాస్ట్లో పాల్గొన్న సింధు, విరాట్తో ఉన్న సాన్నిహిత్యం , మైదానంలో ఆయన ప్రదర్శించే పట్టుదలపై ప్రశంసల వర్షం కురిపించారు.
కెరీర్లో తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో ఒకసారి విరాట్ కోహ్లీని కలిసినట్లు సింధు గుర్తుచేసుకున్నారు. ఏదీ కలసిరావడం లేదని తాను చెప్పినప్పుడు, “ఏదీ ఆలోచించకుండా కేవలం మైదానంలోకి అడుగుపెట్టు. నీవు ఏమిటో, నీ కష్టం ఏమిటో నీకు తెలుసు. ఎలాంటి భయం లేకుండా నీ సహజ సిద్ధమైన ఆటను ఆడు. పోయేదేమీ లేదు, నువ్వేంటో ప్రపంచానికి చూపించు” అని విరాట్ ధైర్యం చెప్పినట్లు తెలిపారు. ఆ ఒక్క మాట తనలో సరికొత్త దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని పేర్కొన్నారు.
అత్యున్నత స్థాయికి ఎదిగిన క్రీడాకారుడి నుంచి ఇలాంటి ప్రోత్సాహం లభించడం గొప్ప విషయమని, తానేదైనా టోర్నీ గెలిచినప్పుడు ఆ సంతోషాన్ని విరాట్తో పంచుకుంటానని సింధు చెప్పారు. ఎంత సాధించినా విరాట్ ప్రదర్శించే క్రమశిక్షణ, నిబద్ధత ఇతరులకు ఎంతో స్పూర్తిదాయకమని కొనియాడారు.
ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ (BWF) ప్రపంచ ఛాంపియన్షిప్లో ఐదుసార్లు పతక విజేతగా నిలిచిన పీవీ సింధు శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ఐర్లాండ్కు చెందిన సోఫియా నోబుల్పై 21-7, 21-11 తేడాతో విజయం సాధించి తదుపరి రౌండ్కు దూసుకెళ్లారు. మైదానంలో నిలకడగా రాణిస్తూనే, విరాట్ లాంటి అగ్రశ్రేణి అథ్లెట్ల అనుభవాలను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నానని సింధు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

