Vladimir Putin: పాశ్చాత్య దేశాల ఆంక్షల పర్వంపై రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన బ్రేక్స్ (BRICS) బిజినెస్ ఫోరమ్ లీడర్స్ సెషన్లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఇతర దేశాలన్నింటిపై విధించిన ఆంక్షలను కలిపినా, దానికి రెట్టింపు స్థాయిలో ఒక్క రష్యాపైనే ఏకంగా 30 వేలకు పైగా ఆంక్షలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వ్యాపారంలో సజావుగా సాగాల్సిన పోటీని కొన్ని దేశాలు అత్యంత అసహ్యకరమైన రీతిలో మార్చేస్తున్నాయని, ఇది ఏకంగా ప్రభుత్వాల స్థాయిలోనే జరుగుతోందని అమెరికాను ఉద్దేశించి విమర్శించారు. గ్యాస్ పైప్లైన్లను ధ్వంసం చేయడం, అంతర్జాతీయ రవాణా మార్గాలను మూసివేయడం, ఓడలను స్వాధీనం చేసుకోవడం వంటి తీవ్రమైన చర్యలకు తెగబడుతున్నారని, తమ ప్రయోజనాలకు లొంగని దేశాలపై ద్వితీయ శ్రేణి ఆంక్షల (Secondary Sanctions) నెపంతో ఒత్తిడి తెస్తున్నారని పుతిన్ ధ్వజమెత్తారు. అయితే, ఈ అపూర్వమైన ఆంక్షల ప్రభావాన్ని రష్యా విజయవంతంగా తిప్పికొట్టిందని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. నమ్మకమైన, ముందస్తు అంచనాలకు అందే భాగస్వామ్య దేశాలతో వ్యాపార సంబంధాలను విస్తరించడం ద్వారా తమ జాతీయ సార్వభౌమత్వాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని స్పష్టం చేశారు. గడిచిన మూడేళ్లలో రష్యా ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచ సగటు కంటే మెరుగ్గా నమోదవడమే తమ ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మరోవైపు, రష్యా-భారత్ ఎనర్జీ డీల్ను దెబ్బతీసేలా అమెరికా సెనెట్ ఇటీవల “లిండ్సే ఓ గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026” పేరిట కీలక బిల్లును ఆమోదించింది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే భారత్, చైనా వంటి దేశాల ఉత్పత్తులపై 100 శాతం వరకు సుంకాలను విధించే అధికారాన్ని ఈ చట్టం అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తుంది. ఈ బిల్లుతో పాటు పుతిన్, ఇతర కీలక అధికారుల లక్ష్యంగా మరిన్ని ఆంక్షలను అమెరికా ప్రతిపాదించింది. అమెరికా హెచ్చరికలపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తమ జాతీయ ప్రాధాన్యతలు, 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలకే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. అమెరికాతో సహా పలు గ్లోబల్ పార్ట్నర్ల నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ ఇంధన భద్రతను కాపాడుకోవడమే భారత్ వ్యూహమని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు. దీనికి మద్దతుగా భారత్లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ మాట్లాడుతూ.. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందని కొనియాడారు. పాశ్చాత్య దేశాలు ఆరోగ్యకరమైన పోటీని పక్కనపెట్టి ఒత్తిడి రాజకీయాలు చేస్తున్నాయని, భారత్కు రష్యా కంటే మెరుగైన ఆఫర్ ఇవ్వలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. భారత్కు ఎంత చమురు అవసరమైనా సరఫరా చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. 18వ బ్రేక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బిష్కెక్లో జరిగిన ఎస్సిఓ (SCO) సదస్సు తర్వాత రెండు వారాల వ్యవధిలోనే వీరిద్దరూ కలవడం ఇది రెండోసారి. ఈ భేటీలో ‘ఎకనామిక్ కోఆపరేషన్ 2030’ ప్రోగ్రామ్ అమలే లక్ష్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, టెక్నాలజీ, డిఫెన్స్, కల్చర్ తదితర రంగాల్లో ఉమ్మడి సహకారాన్ని పెంచుకోవడంపై ఇరు నేతలు విస్తృతంగా చర్చించారు.

