Shaheen Shah Afridi: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో లాహోర్ ఖలందర్స్ జట్టు కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ (Shaheen Shah Afridi)పై కఠిన చర్యలు తీసుకుంది పీఎస్ఎల్ మేనేజ్మెంట్. టీమ్ హోటల్లో భద్రతా నిబంధనలను (Security Protocols) ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో అఫ్రిదీకి 10 లక్షల పాకిస్థానీ రూపాయల (3600 అమెరికన్ డాలర్లు) జరిమానా విధించింది. జట్టులో క్రమశిక్షణను కాపాడటానికి, బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.
CSK-MS Dhoni: ‘ధోని’ లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గెలవలేదా..? ఆయన లేని లోటు స్పష్టంగా..
పంజాబ్ పోలీసులు పీఎస్ఎల్ సీఈఓ సల్మాన్ నసీర్కు రాసిన లేఖ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం క్రీడాకారులు తమ గదుల్లోకి సందర్శకులను అనుమతించకూడదు. అయితే పీసీబీ సెక్యూరిటీ, యాంటీ కరప్షన్ మేనేజర్ అనుమతి నిరాకరించినప్పటికీ.. షాహీన్ అఫ్రిదీ, సికందర్ రజాలు తమ గదిలోకి అతిథులను తీసుకెళ్లారని పోలీసులు ఆరోపించారు. సికందర్ రజా ఆ అతిథులు కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉన్నారని చెప్పగా, పోలీసులు మాత్రం వారు దాదాపు మూడు గంటల పాటు గదిలోనే గడిపారని లేఖలో పేర్కొన్నారు.
ఈ ఘటనలో మరో ఆటగాడు సికందర్ రజా పేరు కూడా ఉన్నప్పటికీ, అతనిపై జట్టు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రజా మాట్లాడుతూ.. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తనదేనని, అఫ్రిదీకి ఇందులో ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. కెప్టెన్ ను ఈ వివాదం నుండి తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ, మేనేజ్మెంట్ మాత్రం అఫ్రిదీపై జరిమానా విధించడానికే మొగ్గు చూపింది.
ఈ వివాదంపై లాహోర్ ఖలందర్స్ స్పందిస్తూ.. ఇది కేవలం ఒక అపార్థం వల్ల జరిగిన పొరపాటే తప్ప, కావాలని నిబంధనలను ఉల్లంఘించాలనే ఉద్దేశం ఆటగాళ్లకు లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బహిరంగంగా అతిగా ప్రచారం చేశారని, అనవసరంగా వివాదాన్ని పెద్దది చేశారని అసహనం వ్యక్తం చేసింది. ఏదేమైనా, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) కచ్చితంగా పాటిస్తామని సంస్థ వివరణ ఇచ్చుకుంది.
