PSL 2026 Ball Tampering: పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ఐపీఎల్ను చూసి పీఎస్ఎల్ నిర్వహిస్తోంది పాకిస్థాన్. పీఎస్ఎల్ (PSL) 2026 సీజన్లో ఒక్కొక్కటిగా వివాదాలు బయటపడుతున్నాయి. ప్రారంభం మ్యాచ్లో వైట్ బాల్ పింక్ బాల్గా మారిన వివాదాన్ని చూశాం. తాజాగా లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ మరో వివాదం పుట్టుకొచ్చింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో లాహోర్ జట్టుకు ‘బాల్ ట్యాంపరింగ్’ ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా ఐదు పరుగుల పెనాల్టీ విధించడం పెను సంచలనంగా మారింది. హారిస్ రవూఫ్ చివరి ఓవర్ వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో, అంపైర్ ఫైసల్ అఫ్రిది బంతిని తనిఖీ చేశాడు. ఆ బాల్ ఆకారం ఉద్దేశపూర్వకంగా మార్చారని నిర్ధారించారు. ఐదు పరుగులు పెనల్టీ విధించారు. దీంతో కరాచీ కింగ్స్ లక్ష్యం 14 పరుగుల నుంచి ఒక్కసారిగా 9 పరుగులకు తగ్గిపోయింది.
READ MORE: CM Chandrababu: నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన.. పుదూరులో టిడ్కో గృహాల ప్రారంభం!
ఈ నిర్ణయంపై లాహోర్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది మైదానంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేసినప్పటికీ, మ్యాచ్ అనంతరం మాత్రం చాలా సంయమనంతో స్పందించారు. “అక్కడ అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. కెమెరా ఫుటేజీని చూసిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయానికి వస్తాం. ఐదు పరుగులు పెనాల్టీగా ఇచ్చేశారు. ఇప్పుడు మేము చేయగలిగింది ఏమీ లేదు” అంటూ షాహీన్ సమాధానమిచ్చాడు. అబ్బాస్ అఫ్రిది ఆఖరి ఓవర్లో ఫోర్, సిక్సర్తో చెలరేగడంతో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక ఈ బాల్ ట్యాంపరింగ్పై సోషల్ మీడియాలో చర్చలు ఊపంపుదుకున్నాయి. నెటిజన్లు పీఎస్ఎల్పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఒక లీగ్ మ్యాచ్లో గెలిచేందుకు మరీ ఇంతలా దిగజారాలా? అంటూ తిట్టిపోస్తున్నారు. పాకిస్థాన్ లీగ్ పరువు బజారున పడుతోందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.