తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి హైదరాబాద్లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి లోనయ్యారు.
ఎడిటర్గా మధు రెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమాలోని ఎమోషన్, రిథమ్, నరేటివ్ ను అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ‘దళం’, ‘దక్ష’, ‘అహ నా పెళ్ళంట’, ‘జగమేమాయ’, ‘వాలెంటైన్స్ నైట్’ వంటి చిత్రాలతో పాటు, త్వరలో విడుదల కానున్న ‘అగ్ని నక్షత్రం’ లాంటి సినిమాలు ఆయన పనితీరును, కథను పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేసే విధానాన్ని తెలియజేస్తాయి.
కేవలం ఫీచర్ ఫిలిమ్స్కు మాత్రమే కాదు.. ఆయన వందలాది చిత్రాలకు ట్రైలర్ ఎడిటర్గా కూడా పనిచేశారు. ‘జగడం’, ‘జల్సా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ట్రైలర్స్ కట్ చేసింది ఆయనే. ఆ ట్రైలర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచడంలో ఆయన ఎడిటింగ్ మార్క్ ఎంతో ఉంది. తన వృత్తి పట్ల ఎంతో అంకితభావం, ఎప్పుడూ ఒదిగి ఉండే మనస్తత్వం మధు రెడ్డి సొంతం. ఆయన వర్క్లో ఎప్పుడూ ఒక స్పష్టత, సినిమాకు కావాల్సిన సరైన పెసింగ్ కనిపిస్తాయి.
మధు రెడ్డి ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సొంత ఊరు కరీంనగర్ నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. భౌతికంగా మన మధ్య లేకపోయినా తన సినిమాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు.
