PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 8వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని పలు రైల్వే అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్దమవుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్- తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్ రైలును అదేరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఎంఎంటీఎస్ రెండో దశ పనులను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునఃఅభివృద్ది పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నరేంద్రమోదీ రూ. 11,355 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుని సికింద్రాబాద్ – తిరుపతి మధ్య సేవలనందించనున్న వందేభారత్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. ఇది దేశంలో ప్రవేశపెట్టనున్న 13 వ రైలు. ఈ రైలు కారణంగా సికింద్రాబాద్ – తిరుపతిల మధ్య ప్రయాణ సమయం 12 గం. ల నుండి 08.30గం.ని.లకు తగ్గిపోతుంది. అనంతరం రూ. 715 కోట్లు ఖర్చు చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నందు చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.
Read Also: Fight For Land: భూతగాదా.. తాహశీల్దార్ ఎదుటే పిచ్చకొట్టుడు
ఇందులో భాగంగా రాబోయే 40 సంవత్సరాల వరకు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించటానికి వీలుగా రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 25,000 మంది ప్రయాణికుల నుండి రద్దీ సమయంలో 3,25,000 మంది ప్రయాణికులకు కూడా సౌకర్యాలను అందించగలిగేలా రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచనున్నారు. రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం ఉన్న 11,427 చదరపు మీటర్ల బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో 61,912 చదరపు మీటర్లకు పెంచటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్ ఫామ్స్ ను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెనను ఈ స్టేషన్ నందు ఏర్పాటు చేయనున్నారు. ఆధునికీకరణ పనులలో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లకు, రాటిఫైల్ బస్ స్టేషన్ కు నేరుగా కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, వచ్చే/వెళ్ళే ప్రయాణికులకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు వంటి అనేక వసతులను అభివృద్ధి పనులలో భాగంగా కల్పించనున్నారు.
సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ మధ్యన రూ. 1,410 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసిన 85 కి. మీ. ల పొడవైన డబ్లింగ్ రైల్వే లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు. సామాన్య ప్రజల రైలుగా మన్ననలు పొందిన MMTS ఫేజ్ – II లో భాగంగా హైదరాబాద్ నగర శివారు పట్టణాల వరకు నిర్మించిన నూతన రైల్వే లైన్ల మీదుగా నడవనున్న 13 కొత్త MMTS సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. MMTS ఫేజ్ – II లో భాగంగా బొల్లారం మరియు మేడ్చల్ మధ్యన 14 కి. మీ. లు, ఫలక్ నుమా – ఉందానగర్ మధ్యన 14 కి. మీ. ల పొడవున కొత్త డబ్లింగ్ లైన్లను నిర్మించడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు, వాటి ప్రయోజనాలకు సంబంధించి రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనను ప్రధాని తిలకించనున్నారు. ఇకపై నగరం శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే సామాన్య ప్రజలు అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు.
Read Also:Bandi Sanjay: సింహం సింగిల్గానే వస్తుంది.. ఎగిరేది బీజేపీ జెండానే
అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధానమంత్రి చేరుకోనున్నారు. పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న తరువాత మొదట రూ. 7,864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 6 జాతీయ రహదారులకు, రూ. 1,366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ నందు చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బీబీ నగర ఎయిమ్స్ నందు అకడమిక్ కోర్సులకు అనుగుణంగా బిల్డింగ్ బ్లాక్ ల నిర్మాణం, ఆడిటోరియం, స్టాఫ్ క్వార్టర్లు, హాస్టల్స్, గెస్ట్ హౌస్ లు, హాస్పిటల్ బ్లాక్ ఆధునికీకరణ వంటి పనులను చేపట్టనున్నారు. ప్రాజెక్టుల భూమిపూజ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.