Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!

Praggnanandhaa (1)

Praggnanandhaa (1)

Praggnanandhaa: నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. చెన్నైలోని ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రజ్ఞానందను అభినందించి, తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థ (SDAT) తరఫున రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేశారు.

నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయ చెస్ ఆటగాడిగా చరిత్ర సృష్టించిన ప్రగ్యానంద ప్రతిభను గుర్తిస్తూ ఈ సత్కారం నిర్వహించారు. కేవలం 20 ఏళ్ల వయసులోనే ప్రపంచ చెస్ వేదికపై మరో అరుదైన ఘనత సాధించిన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన కూడా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్‌తో ప్రజ్ఞానంద చెస్ ఆడగా, ఆ మ్యాచ్‌లో గ్రాండ్‌మాస్టర్ విజయం సాధించాడు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నవారు చప్పట్లతో ప్రజ్ఞానందను అభినందించారు.

×
×
Ad

ఈ సత్కారానికి సంబంధించిన వివరాలను తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకొచ్చిన ప్రజ్ఞానంద విజయాన్ని కొనియాడింది. ఇటీవల నార్వే రాజధాని ఒస్లోలో జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో ప్రగ్యానంద అద్భుత ప్రదర్శన కనబరిచాడు. చివరి రౌండ్‌లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్‌లలో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకోవడం అతని కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక విజయాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్-1 మాగ్నస్ కార్ల్సన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ గుకేష్, అలిరెజా ఫిరూజ్జా, వెస్లీ సో, విన్సెంట్ కీమర్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొన్నారు. ఫిరూజ్జా, కార్ల్సన్, గుకేష్, కీమర్‌లపై ప్రగ్యానంద సాధించిన విజయాలు టైటిల్ రేసులో కీలకంగా మారాయి. ముఖ్యంగా స్వదేశంలో ఆడుతున్న మాగ్నస్ కార్ల్సన్‌ను రెండుసార్లు ఓడించడం టోర్నమెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. ప్రపంచ చెస్ దిగ్గజంపై సాధించిన ఈ డబుల్ విజయం టోర్నమెంట్ కే హైలెట్. ఇక అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో రెండో స్థానంలో నిలవగా, మాగ్నస్ కార్ల్సన్ నాలుగో స్థానంతో టోర్నమెంట్‌ను ముగించాడు.