Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!

Polavaram Displaced Families Protest

Polavaram Displaced Families Protest

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. వి.ఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన నిర్వాసితులకు గోకవరం మండలం కొత్తపల్లి ప్రాంతంలో పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించగా.. దీనిని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు ఇష్టం లేని ప్రాంతంలో పునరావాసం కల్పించవద్దని, తాము కోరుకున్న తాడువాయి ప్రాంతంలోనే పునరావాసం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చింతూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట సుమారు వెయ్యి మంది నిర్వాసితులు ధర్నా నిర్వహించారు.

కొత్తపల్లి ప్రాంతంలో పునరావాసం కల్పించే ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు స్పష్టం చేశారు. తమ అభ్యర్థనను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, తాడువాయి ప్రాంతంలోనే పునరావాసం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నోక్వాల్ ఆందోళనకారులతో చర్చించి.. వారి డిమాండ్లను ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అయితే తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నిర్వాసితులు హెచ్చరించారు. ఇప్పుడు పోలవరం నిర్వాసితుల పునరావాస అంశం మరోసారి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.