Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన CII బిజినెస్ సమ్మిట్లో ప్రసంగించిన ఆయన, PoK ప్రజలు భారత్ కుటుంబంలోని భాగమే అంటూ, త్వరలోనే వారు భారత్ లో కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు మా సొంతవారు, మా కుటుంబ సభ్యులే అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు భౌగోళికంగా, రాజకీయంగా వేరుపడిపోయిన మా సోదరులు త్వరలోనే భారత్ లో ఏకమవుతారన్నారు.
PoK ప్రజలతో భారతదేశానికి గాఢమైన భావోద్వేగ బంధం ఉందని మంత్రి తెలిపారు. అక్కడి ప్రజల్లో ఎక్కువమంది భారత్ తో అనుబంధంగా ఉన్నారని, కొంతమంది మాత్రమే తప్పుదారి పట్టినట్టు అన్నారు. భారతదేశం ఎప్పుడూ హృదయాలను కలిపే విషయాలే మాట్లాడుతుంది. ప్రేమ, ఐక్యత, సత్యం మార్గంలో నడుస్తూ.. మన స్వంత భాగం పీవోకే తిరిగి వచ్చి “నేను భారతదేశం, నేను తిరిగి వచ్చాను” అని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని తాము నమ్ముతున్నట్లు ఆయన అన్నారు.
Read Also: Shrashti Verma: తెల్ల చీరలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ..!
అలాగే ఉగ్రవాద వ్యాపారం లాభదాయకం కాదు.. దాని వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంటూ.. పాకిస్తాన్ ఇప్పటికే దీనిని ఎదుర్కొంటోందని, ఇస్లామాబాద్కు గట్టిగా హెచ్చరికలు జారీ చేసారు. ఇకపై భారత్, పాకిస్థాన్తో చర్చలు జరిపేది ఉగ్రవాదం, PoK విషయంలో మాత్రమేనని స్పష్టం చేశారు. అలాగే భారత రక్షణ రంగం ప్రగతిని గుర్తుచేస్తూ మాట్లాడిన ఆయన, స్వావలంబన సైనిక సామర్థ్యాలను నిర్మించడంలో దేశం ఎంతవరకు పురోగతి చెందిందో సింగ్ హైలైట్ చేశారు. భారతదేశ రక్షణ ఎగుమతి 10 సంవత్సరాల క్రితం రూ. 1,000 కోట్ల కంటే తక్కువగా ఉండేది.. కానీ, ఇప్పుడు అది రూ. 23,500 కోట్ల రికార్డు స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు. ఇప్పటికే స్వదేశీ తాయారీ వ్యవస్థలతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఇప్పుడు భారత్ విదేశాలపై ఆధారపడకుండా ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలు తయారు చేస్తోంది. అంతేకాక భవిష్యత్ యుద్ధ సాంకేతికత కోసం కూడా భారత్ సిద్ధమవుతోందని వివరించారు.