NTV Telugu Site icon

PM Modi in Ayodhya: అయోధ్య దీపోత్సవంలో ప్రధాని మోడీ.. సరయూ నది తీరంలో వేడుకలు

Pm Modi In Ayodhya

Pm Modi In Ayodhya

PM Modi in Ayodhya: దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ రాముడు తన విలువలు, పాలన ద్వారా “సబ్కా సాత్‌ సబ్కా వికాస్” ఆలోచనను ప్రేరేపించారని అన్నారు. దీపావళి ముందురోజు ప్రధాన మంత్రి అయోధ్యలో భగవాన్ శ్రీరాముని రాజ్యభిషేకాన్ని నిర్వహించారు. దేశ ప్రజలందరికీ అయోధ్య వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఈసారి దీపావళి వచ్చిందన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ జరుపుకుంటున్న తరుణంలో శ్రీరాముడి వంటి సంకల్పం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ఆయన అన్నారు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న బ్రిటీష్ కాలం నాటి రాజ్‌పథ్ పేరు మార్చడం వెనుక స్పూర్తి రాముడు అని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని రాముడిని కోరుకున్నానన్నారు. మన దేశంలోని సంస్కృతి ఇంకెకక్కడా లేదన్నారు.

ఈరోజు దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని అయోధ్య చేరుకున్నారు. ఆయనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం, స్ఫూర్తితో అయోధ్య దీపోత్సవం ప్రారంభమైందని.. ఈ ఉత్తరప్రదేశ్ పండుగ దేశానికే పండుగగా మారిందని.. నేడు కొత్త శిఖరాలను తాకుతోందన్నారు. చేరుకున్న ప్రధాని మోదీ ఆదివారం ఇక్కడ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర స్థలాన్ని పరిశీలించారు. శ్రీరామ జన్మభూమిలో రామలాలా విరాజ్‌మన్‌కు ప్రార్థనలు చేశారు. సరయూ నది ఒడ్డున జరిగిన హారతిలో ప్రధాని పాల్గొన్నారు, అనంతరం వేడుకలు ప్రారంభమయ్యాయి. సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి వద్ద 22,000 మంది వాలంటీర్లు 15 లక్షలకు పైగా దీపాలను వెలిగిస్తున్నారు. పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లలో కొన్ని దీపాలను ఉంచారు.

Arvind Kejriwal: ప్రధాని మోడీకి కేజ్రీవాల్‌ కౌంటర్‌.. ఉచితాలని చెప్పి సామాన్యుడిని అవమానించొద్దు..

రికార్డులను నెలకొల్పేందుకు దీపోత్సవంలో లెక్కలేనన్ని స్వదేశీ, అన్యదేశ పుష్పాలతో అయోధ్యను అలంకరించారు. దీపోత్సవ్ 2022ని మరింత అద్భుతంగా చేయడానికి అయోధ్యలోని ప్రతి కూడలిని పూలతో చేసిన రంగోలిలతో అలంకరించారు. సరయూ నది ఒడ్డును మట్టి దీపాలతో అందంగా అలంకరించారు. సూర్యుడు అస్తమించిన వెంటనే అద్భుతమైన లైటింగ్‌తో మిరుమిట్లుగొలిపేలా ఏర్పాట్లు చేశారు. .ప్రధాని పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.