Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..

Pm Modi

Pm Modi

Hindu Rate of Growth: భారతదేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా ప్రధానిగా పదవిలో కొనసాగిన ఎన్నికైన నాయకుడిగా నరేంద్ర మోడీ బుధవారం సరికొత్త రికార్డు సృష్టించారు. 1952 సాధారణ ఎన్నికల తర్వాత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును అధిగమించారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోడీ గత కాంగ్రెస్ ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దశాబ్దాల నుంచి వివాదాస్పదంగా మారిన ‘హిందూ గ్రోత్ రేట్’ (Hindu Rate of Growth) అనే పదాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై ఘాటైన విమర్శలు చేశారు. అసలు ‘హిందూ గ్రోత్ రేట్’? అంటే ఏంటి? దీని వెనుక ఉన్న కథేంటి? ప్రధాని మోడీ దీనిపై ఎందుకు అంతగా ఆగ్రహం వ్యక్తం చేశారో చూద్దాం.

హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి?

రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర చర్చకు దారితీసిన ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’ అనే పదాన్ని 1978లో ప్రముఖ ఆర్థికవేత్త రాజ్ కృష్ణ మొదటిసారిగా ఉపయోగించారు. అప్పట్లో ఆయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. 1950 నుంచి 1980వ దశకం మధ్య కాలంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు కేవలం 3.5 శాతం నుంచి 4 శాతం లోపే నమోదవుతూ వచ్చింది. దేశంలో ప్రభుత్వాలు మారినా, కరువు కాటకాలు వచ్చినా, యుద్ధాలు సంభవించినా.. ఎలాంటి సంక్షోభాలు ఎదురైనా వృద్ధి రేటు మాత్రం అదే స్థాయిలో స్థిరంగా ఉండిపోయింది. దీనిని ఓ సాంస్కృతిక వైఫల్యంగా చూపిస్తూ, భారతీయుల జీవన విధానం లేదా సంస్కృతి(హిందూ సంస్కృతి) వల్లే ఆర్థిక వృద్ధి మందగించిందనే అర్థంలో ఈ పదాన్ని సృష్టించారు. భారత్ ఆర్థికంగా ఎదగకపోవడానికి కారణం భారతీయ సంస్కృతి అని అసత్య ఆరోపణలు చేశారు. ఈ పదం కాలక్రమేణా ఒక అవమానకరమైన వాక్యంగా మారిపోయింది. నిజానికి రాజ్ కృష్ణ హిందువులను విమర్శించాలనే ఉద్దేశంతో ఈ పదాన్ని వాడలేదని నివేదికలు చెబుతున్నప్పటికీ, దేశ మందగమన వృద్ధికి ఒక మతాన్ని లేదా సంస్కృతిని ముడిపెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది.

×
×
Ad

ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ ఈ పదంపై గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో భారతదేశంలో వేగవంతమైన అభివృద్ధి అస్సలు సాధ్యం కాదనే భావనను, నిరాశావాదాన్ని ప్రజల్లో నరనరాన ఇంకించారని మండిపడ్డారు. “పాలన కాంగ్రెస్‌ది, బాధ్యత కాంగ్రెస్‌ది, వైఫల్యం కూడా కాంగ్రెస్‌దే.. కానీ ఆ మందగమన వృద్ధికి ‘హిందూ గ్రోత్ రేట్’ అని పేరు పెట్టి ఆ కళంకాన్ని దేశంలోని అత్యధిక జనాభా కలిగిన హిందువుల నెత్తిన రుద్దారు” అని మోడీ ఆరోపించారు. అత్యంత తెలివిగా కాంగ్రెస్ చేసిన తప్పులను దేశ సంస్కృతికి ఆపాదించారని, నిజానికి ఆ నెమ్మదైన వృద్ధి రేటుకు ‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’ అని పేరు పెట్టాలని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ మార్కు వృద్ధి రేటులో సుపరిపాలన లేదు, సరైన విధానాలు లేవు, మంచి నిర్ణయాలు తీసుకునే ధైర్యం అసలే లేదని ప్రధాని విమర్శించారు. మొదటిసారి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడే దేశంలో అసలైన అభివృద్ధి వేగం ఎలా ఉంటుందో ప్రజలకు కనిపించిందన్నారు. అయితే దురదృష్టవశాత్తూ 2004లో దేశం మళ్లీ రాజకీయ అస్థిరతలోకి, కాంగ్రెస్ పట్టులోకి వెళ్లిపోయిందని, ఫలితంగా అభివృద్ధి పక్కనపడి దేశం వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. చివరకు 2014లో దేశంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాకే భారతదేశ భాగ్యం మారిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. సరైన ఉద్దేశం (నీయత్), స్పష్టమైన విధానం (నీతి), త్వరితగతిన నిర్ణయాలు (నిర్ణయ్).. ఈ మూడు కలిసికట్టుగా పనిచేసినప్పుడు దేశ అభివృద్ధి ఏ రకంగా దూసుకుపోతుందో గత పదేళ్లలో దేశం కళ్లారా చూసిందని ఆయన గర్వంగా ప్రకటించారు. కాంగ్రెస్ సృష్టించిన హీనభావన, నిరాశల నుండి దేశాన్ని బయటపడేసి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే ఎన్డీఏ సాధించిన అతిపెద్ద విజయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.