హైదరాబాద్ నగరంలోని బాగ్ అంబర్పేట్ డివిజన్ లో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో లోక్ సభ ఎన్నికలకు నగారా మోగింది అని తెలిపారు. వచ్చే ఎన్నికలు దేశం కోసం జరిగే ఎన్నికలు.. నరేంద్రమోడీకి ఎంత మెజారిటీ వస్తదో నిర్దేశించే ఎన్నికలు.. ప్రస్తుతం దేశంలో భారతీయ జనతా పార్టీకి 302 స్థానాలు ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో 370 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు అని ఆయన చెప్పారు. ఎన్డీయే కూటమికి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం.. దేశంలో గతంలో ఎన్నడూ లేని మెజారిటీని దేశ ప్రజలు నరేంద్రమోడీకి కట్టబెట్టపోతున్నారు.. దేశంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం.. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం నరేంద్రమోడీ నాయకత్వంలో నీతివంతమైన ప్రభుత్వం మళ్లీ రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: Viral Video: విషాదఘటన.. తండ్రి చేతుల్లో మూడో అంతస్తు నుంచి జారిపడి పసికందు మృతి..!
దేశ గౌరవాన్ని పెంచాలంటే.. పేద ప్రజలకు సంక్షేమం అందాలంటే.. దేశంలో మోలిక వసతులు ఏర్పాటు చేయాలంటే మోడీనే మళ్లీ రావాలని 140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచ దేశాల ముందు దేశ గౌరవాన్ని పెంచిన వ్యక్తి నరేంద్రమోడీనే.. నరేంద్ర మోడీ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక్క రోజు సెలవు తీసుకోకుండా దేశం కోసం ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి 17కు 17 సీట్లు గెలిపించి.. దేశంలో మూడవసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో భాగస్వామ్యులు చేయాలని కోరుతున్నాను అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు.