ఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు నీతి ఆయోగ్ కి సంబంధించి కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ప్రధాని మోడీ వారితో టీ తాగుతూ చర్చిస్తున్న ఫొటోలు కనిపించింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతోనూ ప్రధాని మోడీ ముచ్చటించారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రులను ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు.
మరో ఫోటోలో ప్రధాని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను కలిసిన దృశ్యం కనిపించింది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో భాగం. కానీ.. ప్రధాని మోడీ, ఎంకే స్టాలిన్కి మధ్య ఇటీవలి భాషా వివాదంపై వాడీవేడి రాజకీయం రాజుకున్న విషయం తెలిసిందే.
భాషా వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కఠిన వైఖరి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఈ అంశంపై మిశ్రమ వైఖరిని కనబర్చినట్లు అనిపించింది. అయితే, నీతి ఆయోగ్ సమావేశం తర్వాత భారత్ మండపంలో ఇద్దరు నాయకులు ప్రధాని మోడీతో చాలా ఆప్యాయంగా కనిపించారు. ముచ్చట్లు పెడుతూ.. నవ్వులు పూయించారు.
మరో ఫోటోలో కాంగ్రెస్ పాలిత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధాని మోడీని కలిసిన దృశ్యాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కనిపిస్తున్నారు. ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డిని చాలా ఆప్యాయంగా పలకరించారు.
ఈ సమావేశంలో, ప్రధాని మోడీ రాష్ట్రాలకు ఓ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి వేగాన్ని పెంచాలని, కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే ఏ లక్ష్యమూ అసాధ్యం కాదని ప్రధాని అన్నారు. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.