PM Modi: వెనెజువెలాలో సంభవించిన భీకర జంట భూకంపాల పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విపత్తు సృష్టించిన విధ్వంసంపై గురువారం సోషల్ మీడియా వేదికగా (X) స్పందించిన ఆయన.. బాధితులకు, వెనెజువెలా ప్రభుత్వానికి భారతదేశం తరఫున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కష్టకాలంలో వెనెజువెలాకు అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలను అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బుధవారం సాయంత్రం వెనెజువెలా కరిబియన్ తీరంలో సంభవించిన ఈ జంట భూకంపాల (7.2 మరియు 7.5 తీవ్రత) ధాటికి దేశంలోని పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయి జనం భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపాల ప్రకంపనలు దాదాపు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతం వరకు కూడా తెలిసివచ్చాయి. భూకంప తీవ్రతకు గోడలు కూలిపోవడం, నగరాల్లో పెద్ద ఎత్తున ధూళి మేఘాలు కమ్మేయడంతో రాజధాని కరాకస్ సహా పలు నగరాల్లో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఒక శతాబ్ద కాలంలో వెనెజువెలాలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఇవి ఒకటిగా నిలిచాయి. మోరోన్ నగరానికి పశ్చిమంగా కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే ఈ రెండు భూకంపాలు సంభవించాయి.
వెనెజువెలా తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల్లో ఆస్తి నష్టం జరిగిందని ధృవీకరించారు, అయితే మరణాల సంఖ్యపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రాజధానిలోని ప్రధాన విమానాశ్రయమైన ‘సిమోన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం’ తీవ్రంగా దెబ్బతినడంతో దాన్ని మూసివేశామని, దేశవ్యాప్తంగా పాఠశాలలకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో దేశంలోని ఆరోగ్య సిబ్బంది అందరూ అత్యవసర విధులకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా, ఫాల్కన్ రాష్ట్ర గవర్నర్ విక్టర్ క్లార్క్ అందించిన సమాచారం ప్రకారం.. అక్కడ 32 మంది ఆసుపత్రి పాలయ్యారని, శిథిలాల కింద చిక్కుకున్న మరో 15 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

