Petrol and Diesel Prices: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం చాలా దేశాలపై పడింది.. ముఖ్యంగా.. గ్యాస్, పెట్రో ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.. అయితే, భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల లీటరుకు రూ.3 చొప్పున పెరిగిన ఇంధన ధరలు రాబోయే మూడు నుంచి నాలుగు నెలల పాటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా హార్మూజ్ జలసంధిలో సరఫరా అంతరాయం ఏర్పడుతుందనే భయాలు ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు దాదాపు 110 డాలర్ల స్థాయికి చేరుకోవడంతో ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగింది.
నాలుగేళ్ల తర్వాత భారీ పెంపు
భారతదేశంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత మే 15న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 మేర పెంచారు. పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం చేసిన ధరల పెంపు చమురు కంపెనీలకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ఇది పూర్తిస్థాయి పరిష్కారం కాదని అంటున్నారు. ముడి చమురు ధరలు బ్యారెల్కు 90-100 డాలర్లకు పైగా కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ధరల పెంపులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
మరో రూ.10 వరకు పెరిగే అవకాశం?
ప్రస్తుత పరిస్థితులపై మాస్టర్ పోర్ట్ఫోలియో సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా మాట్లాడుతూ.. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే రాబోయే నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగవచ్చని చెప్పారు. అలాగే ఛాయిస్ ఎనర్జీ అనలిస్ట్ ధవల్ పోపట్ ప్రకారం, లీటరుకు రూ.1 పెంపు వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీల EBITDA దాదాపు రూ.15 వేల నుంచి రూ.16 వేల కోట్ల వరకు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం చేసిన రూ.3 పెంపు వల్ల వార్షికంగా రూ.45 వేల నుంచి రూ.48 వేల కోట్ల వరకు ఉపశమనం లభించవచ్చని అంచనా వేశారు. అయితే, ప్రపంచ ముడి చమురు ధరలు ఇంకా పెరిగితే పరిస్థితిని బట్టి లీటరుకు మొత్తంగా రూ.10 వరకు ధరలు పెంచాల్సిన పరిస్థితి రావచ్చని ఆయన హెచ్చరించారు.
భారత్పై ఎక్కువ ప్రభావం ఎందుకు?
భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పులు దేశీయ ఇంధన ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణంపై ప్రభావం
ఇంధన ధరల పెరుగుదలతో రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం మరింత అధికమయ్యే ప్రమాదం ఉంది. కూరగాయలు, నిత్యావసర సరుకులు, పాల ఉత్పత్తులు, నిర్మాణ సామగ్రి వంటి అనేక వస్తువుల ధరలు పెరగవచ్చని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అయితే, భవిష్యత్తులో ధరల పెరుగుదలను నియంత్రించడంలో ప్రభుత్వ జోక్యం కీలకంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ పరిస్థితులు ఎలా మారుతాయన్నదానిపై వచ్చే నెలల్లో ఇంధన ధరల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
