NTV Telugu Site icon

Kanvar Travel: నేమ్ ప్లేట్‌ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..విచారణ ఎప్పుడంటే..?

Kanvar Travel

Kanvar Travel

కన్వర్ యాత్ర సందర్భంగా కన్వర్ మార్గంలోని దుకాణాలపై నేమ్ ప్లేట్‌లను అమర్చాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించడంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండగా.. మరోవైపు ఈ ఉత్తర్వులపై ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే ఎన్జీవో నేమ్ ప్లేట్‌కు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్జీవో జూలై 20 ఉదయం 6 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై జులై 22 న విచారించనుంది. జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.

READ MORE: Tummala Nageswara Rao: అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల క్లాస్..

ఉత్తర్ ప్రదేశ్ లో ప్రతి ఏటా శివభక్తులు కన్వర్ యాత్ర చేస్తారు. జులై 22 సోమవారం నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. శివుడికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో ఈ కన్వర్ యాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల మంది ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ కన్వార్‌ రూట్‌లోని దుకాణాలకు నేమ్‌ ప్లేట్‌లు అమర్చాలని ప్రభుత్వం నిర్దేశించింది. తాజాగా ఈ వివాదంపై దేశ వ్యాప్తంగా వివాదం కొనసాగుతోంది. యాత్రలో పాల్గొనే భక్తులు ఆహార పదార్థాల విషయంలో కొన్ని కఠినమైన నియమాలు పాటిస్తారు. ఆ నియమాలకు అనుగుణంగా యాత్ర కొనసాగే ప్రదేశంలో ఆహారపదార్థాల దుకాణాలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి దుకాణం ఎదుట యజమాని పేరు రాసిఉంచాలని.. అప్పుడే భక్తులు వారి నియమాలకు అనుగుణంగా ఉండే దుకాణంలో విక్రయాలు జరుపుతారని ప్రభుత్వం అభిప్రాయపడింది. ముస్లిం దుకాణదారులకు నష్టం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది.