Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!

Pesara Idli

Pesara Idli

Pesara Idli: ప్రతిరోజూ ఒకే రకమైన ఇడ్లీ, దోశలు తిని బోర్ కొడుతుంటే ఈసారి పెసరలతో చేసే ఈ ప్రత్యేక ఇడ్లీని ట్రై చేయండి. మినప్పప్పు అవసరం లేకుండానే చాలా మెత్తగా, స్పాంజీగా వచ్చే ఈ ఇడ్లీలు ఆరోగ్యానికి కూడా మంచివి. పెసరల్లో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరైన బ్రేక్‌ఫాస్ట్‌గా నిలుస్తుంది. మరి ఇలాంటి ‘పెసర ఇడ్లీ’ని ఎలా తయారు చేస్తారో ఇక్కడ చూసేయండి..

కావలసిన పదార్థాలు:

ఇడ్లీ కోసం:

* పెసర్లు – 1 కప్పు
* గోధుమ రవ్వ లేదా సూజీ రవ్వ – ½ కప్పు
* పెరుగు – ½ కప్పు
* అల్లం – చిన్న ముక్క
* పచ్చిమిర్చి – 2
* ఉప్పు – తగినంత
* వంట సోడా – ½ టీ స్పూన్
* నీరు – అవసరమైనంత

×
×
Ad

తాలింపు కోసం:

* నూనె – 1 టీ స్పూన్
* జీలకర్ర – 1 టీ స్పూన్
* శెనగపప్పు – 1 టీ స్పూన్
* కరివేపాకు – కొద్దిగా

చట్నీ కోసం కావలసిన పదార్థాలు:

* పల్లీలు – ½ కప్పు
* వెల్లుల్లి రెబ్బలు – 10
* పచ్చిమిర్చి – 4 నుంచి 5
* జీలకర్ర – 1 టీ స్పూన్
* చింతపండు – చిన్న ముక్క
* ఉప్పు – తగినంత
* తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు

తయారీ విధానం:

ముందుగా పెసర్లను శుభ్రంగా కడిగి రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత నీటిని పూర్తిగా వంపేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, గోధుమ రవ్వ, పెరుగు వేసి కొద్దిగా నీరు జత చేస్తూ బరకగా గ్రైండ్ చేయాలి. పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టాలి. దీంతో రవ్వ బాగా నానుతుంది. ఇప్పుడు పిండిలో తగినంత ఉప్పు, వంట సోడా వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలిపి ఇడ్లీ పిండిలా ఉండేలా చేసుకోవాలి.

మరోవైపు పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర, శెనగపప్పు, కరివేపాకు వేసి తాలింపు సిద్ధం చేయాలి. ఈ తాలింపును పిండిలో వేసి కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి పిండిని పోయాలి. ముందుగా నీరు మరిగించిన ఇడ్లీ పాత్రలో ప్లేట్లను ఉంచి సుమారు 10 నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి. ఉడికిన తర్వాత రెండు నిమిషాలు చల్లారనిచ్చి ఇడ్లీలను తీసుకోవాలి. దీంతో మెత్తగా, స్పాంజీగా ఉండే పెసర ఇడ్లీలు సిద్ధమవుతాయి.

చట్నీ తయారీ:

పల్లీలను సన్నని మంటపై వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చింతపండు వేయించి చల్లారనివ్వాలి. తర్వాత పల్లీలతో పాటు ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసి ఉప్పు, నీరు జత చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చివరగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో తాలింపు పెట్టి చట్నీలో కలపాలి. వేడివేడిగా ఉన్న పెసర ఇడ్లీలను ఈ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. సాధారణ ఇడ్లీలకు బదులుగా ఈ హెల్దీ వెర్షన్‌ను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.