‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం సౌత్.. నార్త్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ – అట్లీ మూవీ అనౌన్స్ చేసిన దగ్గరి నుండి ఈ మూవీలో మృణాల్ కూడా భాగం అయినట్లుగా వార్తలు వినపడుతున్నాయి. కానీ దీని గురించి అట్లి నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవల ఆమె దుల్కర్ సల్మాన్తో కలిసి నటించిన ‘భీగి భీగి’ మ్యూజిక్ వీడియో ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చింది మృణాల్ పాప. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మూవీలో నటిస్తోందనే వార్తలపై విలేకరులు ఆమెను ప్రశ్నించారు.
ఈ వార్తలపై మృణాల్ నవ్వుతూ స్పందిస్తూ.. ‘అవునా? నిజంగానే నా పేరు వినపడుతోందా? నాకైతే ఇప్పటి వరకు అలాంటి సమాచారం రాలేదు. కానీ మీరందరూ ప్రార్థించండి.. అదే నిజమైతే మనమందరం కలిసి పెద్ద సెలబ్రేషన్ చేసుకుందాం’ అంటూ సరదాగా సమాధానమిచ్చారు. దీనితో ప్రస్తుతానికి ఆ సినిమాలో తాను లేనని ఆమె పరోక్షంగా స్పష్టం చేశారు. అయితే, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో పని చేసే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోనని, ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం మృణాల్ హిందీలో ‘దో దివానే షెహర్ మే’, ‘డకాయిట్’ వంటి క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. తెలుగులో కూడా మరికొన్ని కొత్త కథలను వింటున్నట్లు సమాచారం. రూమర్స్ ఎలా ఉన్నా, బన్నీ – మృణాల్ జోడీ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
