US-Iran Conflict: మిడిల్ ఈస్ట్ సంక్షోభానికి ఎగ్జిట్ దొరకడం లేదు. ఇరాన్ యుద్ధం నాలుగో వారానికి చేరుకుంది. ఓవైపు అమెరికా చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే, మరోవైపు ఇజ్రాయిల్ ఇరాన్పై భారీ దాడులు చేస్తూనే ఉంది. ఇక ఇరాన్ గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్పై దాడులు చేస్తూనే ఉంది. చర్చల కోసం డొనాల్డ్ ట్రంప్ అవకాశం కనిపించినప్పటికీ, మరోవైపు సైనిచ చర్యల గురించి అమెరికా ఆలోచిస్తునట్లు తెలుస్తోంది.
పెంటగాన్ వద్ద పెరిగిన ‘‘పిజ్జా ఆర్డర్లు’’:
అమెరికా ఏదైనా పెద్ద యాక్షన్, అంటే యుద్ధం లేదా ఏదైనా సైనిక ఆపరేషన్ చేసే ముందు పెంటగాన్ వద్ద రాత్రి వేళల్లో పిజ్జా ఆర్డర్లు పెరుగాయనేది సంకేతంగా భావిస్తారు. ఇటీవల రాత్రి వేళల్లో పిజ్జా ఆర్డర్లు అసాధారణంగా పెరిగినట్లు సమచారం. దీనిని బట్టి చూస్తే పెంటగాన్ వద్ద అధికారుల అత్యవసర సమావేశాలు జరుగుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పెంటగాన్ పరిసర ప్రాంతాల్లో పిజ్జా డెలివరీలను ట్రాక్ చేసే ఒక వెబ్సైట్ ప్రకారం, ఈ గురువారం సాయంత్రం అక్కడ పిజ్జా ఆర్డర్లు అసాధారణంగా పెరిగాయి. డోమినోస్, పప జాన్స్, పిజ్జాటో పిజ్జా ఆర్డర్లు ఏకంగా 200 శాతానికి మించాయి. 1970లలో సోవియట్ గూఢచార అధికారులు అర్ధరాత్రి ఫుడ్ డెలివరీని గమనించడం ద్వారా యూఎస్ చేపట్టే పెద్ద చర్యలను అంచనా వేసేది.
గ్రౌండ్ ఆపరేషన్స్కు అమెరికా ప్లాన్ చేస్తోందా?
ఓ వైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే, ఇరాన్ ను లొంగదీసుకోవడానికి అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యూఎస్ మిడిల్ ఈస్ట్కు మరో 10,000 మంది సైనికుల్ని పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా ట్రంప్ సర్కార్ ఖేష్మ్ దీవిని, ఖార్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడంతో పాటు యురేనియం నిల్వల్ని చేజిక్కించుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే మూడు మార్గాలను అన్వేషిస్తోందని తెలుస్తోంది. ట్రంప్ సాధారణంగా శనివారం మార్కెట్లు మూతపడిన తర్వాత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉంది. శనివారం కీలక సైనిక చర్యకు ఆదేశించే అవకాశం ఉందని కథనాలు ప్రచురితమవుతున్నాయి.