రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో గురువారం జరిగిన తొలి క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని, పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఆడటంలో బ్యాటర్లు విఫలమయ్యారన్నాడు. తాము తక్కువ స్కోర్ లక్ష్యంగా విధించామని, బౌలర్లను ఏమాత్రం నిందించలేం అని చెప్పాడు. మ్యాచ్ వైఫల్యంపై అధ్యయనం చేయాలన్నాడు. ఇది మర్చిపోలేని రోజు అని శ్రేయాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. క్వాలిఫయర్లో ఆర్సీబీకి ఎక్కడా కూడా పంజాబ్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘ఇది మర్చిపోలేని రోజు. మళ్లీ మొదటి నుంచి మొదలెట్టాలి. మేము ఆరంభంలోనే వికెట్లు కోల్పోయాము. చాలా విషయాలను మేం అధ్యయనం చేయాలి. నిజం చెప్పాలంటే నా నిర్ణయాలపై నాకు ఎటువంటి సందేహం లేదు. మేము ప్రణాళిక పరంగా ఏం చేసినా, మైదానం వెలుపల ఏం చేసినా.. అది సరైనదేనని భావిస్తున్నాను. ఈరోజు మైదానంలో మా ప్రణాళికలను సరిగా అమలు చేయలేకపోయాము. బౌలర్లను కూడా నిందించలేము. ఎందుకంటే మేం చాలా తక్కువ లక్ష్యాన్ని ఇచ్చాం. ఈ పిచ్పై మా బ్యాటింగ్ బాగాలేదు, ఈ విషయంలో వర్క్ చేయాల్సి ఉంది. మేం ఇక్కడ ఆడిన అన్ని మ్యాచ్ల్లో బౌన్స్ ఉంది. అయితే వీటిని మేం సాకులుగా చెప్పలేం. ఎందుకంటే ఓ క్రికెటర్ పరిస్థితికి అనుగుణంగా బ్యాటింగ్ చేయాలి. మేం టైటిల్ యుద్దంలో ఓడిపోలేదు. కేవలం ఈ మ్యాచులో మాత్రమే ఓడిపోయాం’ అని చెప్పాడు.