డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలోని ఇంజనీరింగ్ అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ.. పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదంటూ అధికారులను నిలదీశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు అటవీ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్వ పథకం సహా ప్రధాన కార్యక్రమాల అమలు స్థితిపై పవన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read: Shree Charani: ఇది మొదటి అడుగు మాత్రమే.. ముందు చాలా ఉంది!
గ్రామీణ రహదారుల నిర్మాణం, పర్యవేక్షణ కోసం త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రాథమిక దశలో అడవి తల్లి బాట ప్రాజెక్టును ఈ కొత్త టెక్నాలజీకి అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఇక సాస్కీ నిధులతో పల్లె పండగ 2.0 అమలు జరుగుతుందని తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి జల్ జీవన్ మిషన్ మరియు స్వమిత్వ పనులను స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. మార్చి నాటికి కోటి స్వమిత్వ కార్డులు ప్రజలకు పంపిణీ చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే సుమారు 761 గిరిజన గ్రామాలను అనుసంధానించే 662 రహదారుల నిర్మాణానికి 1,158 కోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మరో 2,123 కోట్ల సాస్కీ నిధులతో 4,007 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు, గోకులాలు మరియు డ్రైన్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
