పోరాటాలకు పురిటి గడ్డయిన తెలంగాణ నాలో పోరాట స్ఫూర్తిని నింపిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉందని.. 1947లో తెలంగాణ మినహా దేశమంతటికీ స్వతంత్రం సిద్ధించిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పెషల్ ట్వీట్ చేశారు. స్వాతంత్రం కోసం తెలంగాణ మరో రెండేళ్లు వేచి చూడవలసి వచ్చిందని చెప్పారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం సుమారు 60 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు. సకల జనుల కల సాకారమై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుడే దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ గాలిలో.. నేలలో.. నీటిలో.. మాటలో… చివరకు పాటలో సైతం పోరాట పటిమ తొణికిసలాడుతుందని తెలిపారు.
READ MORE: I.N.D.I.A: ఈసీని కలవనున్న ఇండియా కూటమి..ఎందుకంటే?
నీళ్లు నిధులు- నియామకాలనే నినాదంతో సకల జనులు సాగించిన ఉద్యమాన్ని పాలకులు సదా గుర్తెరగాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ తెలంగాణ ఫలాలు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా అందాలని సూచించారు. అభివృద్ధిలో తెలంగాణా రాష్ట్రం అగ్రపదంలో పాలకులు నిలపాలని కోరారు. ప్రజా తెలంగాణను సంపూర్ణంగా ఆవిష్కరింప చేయాలన్నారు. అప్పుడే ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరులకు నిజమైన నివాళి అని తెలిపారు. ఈ దశాబ్ద వేడుకల సందర్భంగా తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన తెలంగాణ వాసులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.