Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..

Kunki

Kunki

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు అడవి ఏనుగుల సమస్య నుంచి ఉపశమనం లభించనుంది. ఒడిశా సరిహద్దుల నుంచి వస్తున్న ఏనుగుల గుంపులు పంటలను, గ్రామాలను నాశనం చేస్తున్న నేపథ్యంలో.. పలమనేరు ముసలమడుగు క్యాంపు నుంచి ‘అభిమన్యు’, ‘జయంత్’ అనే రెండు కుంకీ ఏనుగులను మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు కుంకీలు మానవ-ఏనుగుల సంఘర్షణను అదుపు చేయడంలో ఎంతో అనుభవం ఉన్నవి. పలమనేరు వద్ద ఒంటరి ఏనుగును బంధించడంతో పాటు ఇవి ఇప్పటికే ఆరు ప్రధాన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశాయి. వీటిమధ్య ఉన్న సమన్వయం కారణంగానే అధికారులు వీటిని ఎంపిక చేశారు.

మన్యం జిల్లాలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి ఏనుగుల మళ్లింపు చర్యలు చేపట్టాలని, అక్కడ నుంచి మరికొన్ని కుంకీలను తేవాలని పవన్ కళ్యాణ్ భావించారు. ఆలోగా తక్షణ ఉపశమనం కోసం ప్రస్తుతం ఉన్న ఈ రెండు ఏనుగులను గుచ్చిమికి తరలిస్తున్నారు. వీటి సాయంతో పాటు, అటవీ శాఖ ఆధ్వర్యంలో పలు అధునాతన చర్యలు కూడా చేపడుతున్నారు. అందులో ముఖ్యంగా.. సమస్యాత్మక ప్రాంతాల్లో సౌర (సోలార్) కంచెల నిర్మాణం, ఏనుగులు రాకుండా కందకాల తవ్వకం, నీటి వనరుల అభివృద్ధి, ఏఐ (AI) ఆధారిత పర్యవేక్షణ మరియు డ్రోన్ నిఘా, ‘హనుమాన్ ర్యాపిడ్ రెస్పాన్స్’ బృందాల ఏర్పాటు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. ఈ విస్తృత చర్యలతో మన్యం ప్రాంతంలో ఏనుగుల దాడి భయాలు తొలగిపోతాయని స్థానికులు ఆశిస్తున్నారు.