Pawan Kalyan visits Delhi for key Jana Sena meetings: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పార్టీ విస్తరణతో పాటు జాతీయ స్థాయిలో జనసేన భావజాలాన్ని ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఉన్న ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో నిర్వహించే పలు కీలక కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి మధ్యాహ్నం 3:45 గంటలకు బయలుదేరనున్న పవన్.. సాయంత్రం 4:25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 4:30 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. రాత్రి 6:40 గంటలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత నేరుగా తాజ్ హోటల్కు వెళ్లనున్నారు.
ఢిల్లీలో జనసేన పార్టీకి చెందిన ఐదు రాష్ట్రాల ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, వివిధ రాష్ట్రాల్లో జనసేన విస్తరణ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ కీలక సూచనలు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండియా గేట్ సమీపంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. ‘సేన గళం’ కార్యక్రమం ద్వారా జనసేన సిద్ధాంతాలు, లక్ష్యాలను దేశ ప్రజలకు వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయాల్లో జనసేన పాత్ర, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని ఈ వేదికగా పవన్ వెల్లడించే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత పెరగడానికి మరో కారణం.. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనసేన నాయకులు హాజరుకానుండటమే. సుమారు 150 మంది జనసేన ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ కీలక నాయకులు ఉన్నారు. అశోక్ హోటల్లో నిర్వహించనున్న సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, ప్రజల్లో మరింతగా చొచ్చుకుపోయే కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జనసేన నాయకులు ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటన జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

