ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం.. రెండూ మన భారతదేశం యొక్క జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న జనసేన సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. తాజాగా పవన్ వారికి ఎక్స్ వేదికగా సమాధానం చెప్పారు.
READ MORE: Odisha: బ్రహ్మణ మహిళను పెళ్లి చేసుకున్న గిరిజన మాజీ ఎంపీ.. తెగ నుంచి బహిష్కరణ..
“నేను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. హిందీని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే నేను వ్యతిరేకించాను. ఎన్ఈపీ2020 స్వయంగా హిందీని అమలు చేయనప్పుడు, దాని విధించడం గురించి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎన్ఈపీ 2020 ప్రకారం, విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలను (వారి మాతృభాషతో సహా) నేర్చుకునే వెసులుబాటును కలిగి ఉంటారు. వారు హిందీని అధ్యయనం చేయకూడదనుకుంటే, వారు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మెయిటీ, నేపాలీ, సంతాలి, ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చు. బహుళ భాషా విధానం విద్యార్థులకు ఎంపిక చేసుకునే శక్తిని ఇవ్వడానికి, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి రూపొందించబడింది. ఈ విధానాన్ని రాజకీయ అజెండాల కోసం తప్పుగా అర్థం చేసుకోవడం, పవన్ తన వైఖరిని మార్చుకున్నారని చెప్పడం అవగాహనా లోపాన్ని ప్రతిబింబిస్తుంది. జనసేన పార్టీ ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యా ఎంపిక సూత్రానికి దృఢంగా కట్టుబడి ఉంది.” అని ట్వీట్లో పవన్ స్పష్టం చేశారు.