ICC Women’s T20 World Cup: ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గ్రూప్-ఎ మ్యాచ్ కేవలం ఆట పరంగానే కాకుండా, ఐసీసీ విధించిన జరిమానాతోనూ వార్తల్లో నిలిచింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియాపై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గానూ పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయం ముగిసేసరికి పాక్ జట్టు ఒక ఓవర్ వెనుకబడి ఉండటంతో, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ మ్యాచ్ రేఫరీ ట్రూడీ ఆండర్సన్ ప్రకటించారు. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. కనీస ఓవర్ రేట్ కంటే ఒక ఓవర్ ఆలస్యమైతే ఆటగాళ్లకు 5 శాతం జరిమానా విధిస్తారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా తన జట్టు చేసిన తప్పును అంగీకరించి, ఐసీసీ ప్రతిపాదించిన శిక్షను ఏకీభవించడంతో ఈ వివాదానికి ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేకుండానే తెరపడింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు క్లేర్ పొలోసాక్, జాక్వెలిన్ విలియమ్స్ తో పాటు థర్డ్ అంపైర్ ఎలోయిస్ షెరిడాన్, ఫోర్త్ అంపైర్ సూ రెడ్ఫెర్న్ ఈ తప్పిదాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సరికొత్త టీ20 ప్రపంచకప్ టైటిల్ వేటను భారత్ ఘనంగా ప్రారంభించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 170 పరుగుల భారీ స్కోరు సాధించగా.. ఆ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ను భారత బౌలర్లు 106 పరుగులకే కుప్పకూల్చారు. ఫలితంగా 64 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. గత వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 5 వికెట్లు, 58 పరుగులతో అదరగొట్టిన భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ.. ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించి పాక్ను కోలుకోకుండా చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభం బాగానే ఉన్నప్పటికీ, దీప్తి శర్మ సృష్టించిన మాయాజాలంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. ముఖ్యంగా పాక్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో 41 పరుగులు చేసి ప్రమాదకరంగా మారిన మునీబా అలీని, బ్యాక్వర్డ్ పాయింట్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి దీప్తి శర్మ అద్భుతమైన డైరెక్ట్ హిట్తో రనౌట్ చేయడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఆ మరుసటి ఓవర్లోనే పాక్ కెప్టెన్ ఫాతిమా సనా అవుట్ కావడంతో పాకిస్థాన్ చేతులెత్తేసింది. మ్యాచ్ ముగిసే సమయానికి కేవలం ఐదు బంతుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లను పడగొట్టి, మొత్తంగా 10 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించిన దీప్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్రదర్శనతో మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (166 వికెట్లు) తీసిన బౌలర్గా దీప్తి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆమెకు తోడుగా శ్రీ చరణి 21 పరుగులిచ్చి 3 వికెట్లతో రాణించింది.

