NTV Telugu Site icon

Pakistan: పాకిస్థాన్‌లో 37 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు వాయిదా

Pakistan

Pakistan

Pakistan: పాకిస్థాన్‌లోని వివిధ హైకోర్టుల ఆదేశాల మేరకు పీటీఐ చట్టసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 37 పార్లమెంట్ స్థానాలకు ఆదివారం పాకిస్థాన్ అత్యున్నత ఎన్నికల సంఘం ఎన్నికలను నిలిపివేసింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి చెందిన శాసనసభ్యులు రాజీనామా చేయడంతో జాతీయ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. పాకిస్థాన్ ఎన్నికల సంఘం తొలుత మార్చి 16న 33 స్థానాలకు, మార్చి 19న మరో 31 స్థానాలకు ఎన్నికలను షెడ్యూల్ చేసింది.

అయితే పెషావర్, సింధ్, బలూచిస్థాన్ హైకోర్టులు తమ తమ ప్రావిన్స్‌లలో ఉప ఎన్నికలను నిలిపివేశాయి. ఇస్లామాబాద్ హైకోర్టు ముగ్గురు చట్టసభ సభ్యుల డీ-నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. పర్యవసానంగా పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం ఆదివారం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్‌లను జారీ చేసింది. సంబంధిత కోర్టుల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బలూచిస్తాన్‌లో ఒక స్థానంలో, ఇస్లామాబాద్‌లో మూడు, సింధ్‌లో 9, ఖైబర్ పఖ్తుంక్వాలోని 24 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేసింది.

Read Also: Aaditya Thackeray: ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడింది..

గత సంవత్సరం అవిశ్వాస ఓటు ద్వారా ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వం పడగొట్టబడిన తర్వాత పీటీఐ చట్టసభ సభ్యులు రాజీనామా చేశారు. జనవరి 17న 34 మంది సభ్యుల రాజీనామాలను, జనవరి 20న 35 మంది సభ్యుల రాజీనామాలను నేషనల్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. అయితే పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం వారిలో కొందరిని డి-నోటిఫై చేసి ఉప ఎన్నికలను ప్రకటించింది. పీటీఐ వారి రాజీనామాలను ఆమోదించాలనే స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులను ఆశ్రయించి ఉపశమనం పొందేలా చేసింది. దేశంలో ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ఒత్తిడి చేస్తుండగా, ఆగస్టు తర్వాత ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది.