Site icon NTV Telugu

Abdul Basit: “ఆ పరిస్థితే వస్తే భారత్‌పై అణు దాడి చేస్తాం”.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ హెచ్చరిక..

Pak2

Pak2

Abdul Basit: భారత్‌, పాకిస్థాన్‌లు రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. అణ్వాయుధాలు కలిగి ఉన్నప్పటికీ భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండగా.. పాకిస్థాన్ సైన్యం, దాని ఉన్నతాధికారులు మాత్రం రెచ్చిపోతున్నారు. మధ్యప్రాచ్య సంఘర్షణల నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ అమెరికా పాకిస్థాన్‌పై అణు దాడి చేస్తే.. పాకిస్థాన్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటుందన్నాడు. 2014 నుంచి 2017 వరకు న్యూఢిల్లీలో ఇస్లామాబాద్ అగ్రశ్రేణి దౌత్యవేత్తగా పనిచేసిన బసిత్.. సాధ్యం కాని విషయం గురించి ప్రస్తావించాడు. ఒకవేళ ఇరాన్ పరిస్థితి విషమించి, ఇజ్రాయెల్, అమెరికా మన అణ్వాయుధ సామర్థ్యాన్ని నాశనం చేయాలని చూస్తే.. పాకిస్థాన్‌ భారత్‌పై దాడి చేస్తుందన్నాడు. అమెరికా లేదా ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేసే అవకాశం లేకపోతే, తాము ఏమాత్రం వెనుకాడకుండా ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాలపై విరుచుకుపడతామని హెచ్చరించారు.

READ MORE: Ravichandran Ashwin: “4 ఓవర్లు వేయకపోతే రూ.2 కోట్లు కట్ చేయండి”.. ఆస్ట్రేలియా ప్లేయర్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్..

ఆ తర్వాత జరిగే పరిణామాలను అప్పుడు చూసుకోవచ్చని పిచ్చికూతలు కూశాడు. ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడమే తమ ముందున్న ఆప్షన్ అని బాసిత్ పేర్కొన్నాడు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణ మరింత ఉద్రిక్త దశలోకి ప్రవేశించిన తరుణంలో బాసిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత మూడు వారాలుగా, సైనిక దాడులు, ప్రతిదాడులు పలు రంగాలలో విస్తరించాయి. ఇజ్రాయెల్ టెహ్రాన్, బీరుట్‌లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు, అమెరికా బలగాలు ఆ ప్రాంతంలో వ్యూహాత్మక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాయి.

Exit mobile version