Pakistan Suicide Bomb Attack: పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ను భయంతో కుదిపేసిన ఘోర ఘటన ఇది. శుక్రవారం నమాజ్ సమయంలో షియా మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 169 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాద సంస్థ ఓ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ దాడికి తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇస్లామాబాద్ శివారులోని తర్లాయి ప్రాంతంలో ఉన్న ఇమామ్ బర్గాహ్ ఖస్ర్-ఎ-ఖదీజతుల్ కుబ్రా మసీదులో ఈ పేలుడు జరిగింది. శుక్రవారం కావడంతో మసీదు నిండా జనాలు కిక్కిరిసిపోయారు. ప్రార్థనలు మొదలవుతున్న సమయంలోనే దుండగుడు మసీదు గేటు దగ్గర ఆత్మాహుతి పేలుడుకు పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది అతడిని ఆపే ప్రయత్నం చేసిన తరుణంలో తన శరీరానికి కట్టుకున్న బాంబును పేల్చేశాడు.
READ MORE: NBK : బాలయ్య గ్రీన్ సిగ్నల్ కోసం.. బారులు తీరిన నలుగురు స్టార్ దర్శకులు..
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన అనంతరం మసీదులోని జనాలు శబ్దంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై 52 ఏళ్ల మహమ్మద్ కాజిమ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. “నమాజ్ మొదటి భాగంలో వంగుతున్న సమయంలో తుపాకీ శబ్దం వినిపించింది. ఆ వెంటనే భయంకరమైన పేలుడు జరిగింది” అని చెప్పాడు. మరో వ్యక్తి ఇమ్రాన్ మహ్మూద్ మాట్లాడుతూ.. దుండగుడికి, అక్కడున్న భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయని వెల్లడించాడు. ఒక వాలంటీర్ అతడిని కాలిలో కాల్చిన తర్వాతే అతడు పేలుడు జరిపాడని అన్నాడు. పేలుడు తర్వాత పరిస్థితి అత్యంత విషాదంగా మారింది. ఆసుపత్రుల్లో రక్తంతో తడిసిన బట్టలతో గాయపడినవారిని స్ట్రెచర్లపై తీసుకొచ్చారు. కొందరిని చేతుల్లో, మరికొందరిని కార్లలో తీసుకొచ్చారు. ఒక బాధితుడిని కారు డిక్కీలో తీసుకొచ్చిన దృశ్యం అందరినీ కలిచివేసింది. ఆసుపత్రి బయట బంధువులు ఏడుస్తూ కేకలు వేస్తూ కనిపించారు.
ఈ ఘటన అనంతరం మసీదు చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. నేలపై రక్తపు మరకలు, చెప్పులు, విరిగిన అద్దాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిలో మసీదు గేటు దగ్గర శవాలు పడి ఉన్నట్లు కనిపించింది. అయితే వాటిని అధికారికంగా నిర్ధారించలేదు. ఈ దాడిపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. దాడి చేసినవారిని వదిలిపెట్టబోమని, తప్పక శిక్షిస్తామని చెప్పారు. ఉప ప్రధాని ఇషాక్ దార్ ఈ ఘటనను “మానవత్వంపై జరిగిన ఘోర నేరం”గా పేర్కొన్నారు. ఇలాంటి దాడులు ఇస్లాం సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని అన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం పౌరులపై, ప్రార్థనా స్థలాలపై దాడులు అంగీకరించలేమని అన్నారు.
