PM Modi: పాకిస్థాన్ నుంచి మోడీకి ఆహ్వానం.. మోడీ దాయాది దేశానికి వెళ్తారా?

Pm Modi

Pm Modi

PM Modi: 2027లో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు పాకిస్థాన్‌ అధికారికంగా స్పష్టం చేసింది. ఒక మీడియా సమావేశంలో పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. SCO సభ్యదేశాలన్నింటికీ నిబంధనల ప్రకారం ఆహ్వానాలు పంపుతామని వెల్లడించారు. ఈ సంస్థ ప్రోటోకాల్ ప్రక్రియ ప్రకారం, ఆతిథ్యం ఇచ్చే దేశం సభ్యదేశాల అధినేతలను, ప్రభుత్వ నాయకులను ఆహ్వానించడం ఒక బాధ్యత అని, కాబట్టి భారత్ కూడా ఈ జాబితాలో ఖచ్చితంగా ఉంటుందని ఆయన వివరించారు. ఇదే సమయంలో, మనీలాలో జరిగే ఆసియాన్ (ASEAN) సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి మధ్య ఏవైనా ద్వైపాక్షిక భేటీలు జరుగుతాయా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. భారత్ నుంచి అటువంటి సమావేశం కోసం ఎలాంటి అభ్యర్థన రాలేదని పాక్ ప్రతినిధి పేర్కొన్నారు.

యూరేషియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, ఆర్థిక పురోగతిని పెంపొందించే లక్ష్యంతో 2001 జూన్ 15న బీజింగ్‌లో ఈ షాంఘై సహకార సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో భారత్, పాకిస్థాన్‌, చైనా, రష్యా, ఇరాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అనే 10 సభ్యదేశాలు ఉన్నాయి. ఈ సంస్థలో అత్యున్నత నిర్ణయాధికార విభాగమైన ‘కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్’ (CHS) అధ్యక్ష బాధ్యతలు ప్రతి సంవత్సరం ఆంగ్ల అక్షర క్రమం (Alphabetical Order) ప్రకారం సభ్యదేశాల మధ్య మారుతుంటాయి. ఆ క్రమంలోనే 2027లో ఇస్లామాబాద్‌ వేదికగా ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించే అవకాశం పాకిస్థాన్‌‌కు దక్కింది.