Babar Azam Says Indian hospitality is amazing: భారత్లో తమకు అపూర్వ స్వాగతం లభించిందని, ఆతిథ్యం అద్భుతంగా ఉందని పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపాడు. తొలిసారి భారత్కు వచ్చినా.. త్వరగానే పరిస్థితులను అలవాటు చేసుకున్నామన్నాడు. పాక్ జట్టులోని ప్రతి ఒక్కరికి అభిమానుల నుంచి మంచి మద్దతు లభించిందని బాబర్ పేర్కొన్నాడు. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 నుంచి పాక్ నిష్క్రమించింది. లీగ్ స్టేజ్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించడంతో ఇంటిముఖం పట్టింది.
‘నేను భారత్ నుంచి ఎంతో ప్రేమ పొందా. నేనే కాదు జట్టులోని ప్రతి ఒక్కరికి అభిమానుల నుంచి మద్దతు లభించింది. పాకిస్తాన్ జట్టులోని ప్రతిఒక్కరు భారత్కు తొలిసారి వచ్చారు. అయినా త్వరగానే పరిస్థితులను అలవాటు పడ్డాం. సెమీస్ చేరుకోకపోవడం నిరాశ కలిగించే అంశం. మిడిల్ ఓవర్లతో పాటు చివర్లో పరుగులు రాబట్టాల్సింది. బంతి పాత బడిన తర్వాత పరుగులు చేయడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి అనుభవాలను ఇక్కడ చవిచూశాం’ అని బాబర్ అజామ్ తెలిపాడు.
Also Read: World Cup 2023: భారత్ ఇప్పుడు ప్రపంచకప్ గెలవకపోతే.. మరో 3 సార్లు ఆగాల్సిందే!
‘వన్డే ప్రపంచకప్ 2023ని మేం సరిగ్గా ముగించలేకపోయాం. నిజం చెప్పాలంటే.. వ్యక్తిగతంగా నేను బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. 50 లేదా 100 పరుగులు చేయడమే నా లక్ష్యం కాదు, జట్టును గెలిపించడం ముఖ్యం. నా ప్రదర్శన జట్టు విజయాలకు ఉపయోగపడాలని అనుకుంటా. నేను నెమ్మదిగా ఆడినా, వేగంగా ఆడినా అది జట్టు పరిస్థితులకు అనుగుణంగానే ఉంటుంది. ఎవరైనా జట్టుకు అవసరమైన విధంగా ఆడాల్సి ఉంటుంది’ అని పాక్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.