Pakistan: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూడాన్ దేశానికి ఆయుధాలు, యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,500 కోట్లు) భారీ రక్షణ ఒప్పందాన్ని పాకిస్థాన్ రద్దు చేసుకుంది. తమకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన సౌదీ అరేబియా చేసిన విజ్ఞప్తి మేరకు ఇస్లామాబాద్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
READ ALSO: Jeevan Reddy : రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్తోనే సాధ్యం
అసలు కారణం ఇదేనా..
గత మూడేళ్లుగా సూడాన్ దేశం తీవ్రమైన అంతర్యుద్ధంతో నలిగిపోతోంది. అక్కడ అధికార సైన్యానికి, పారామిలిటరీ దళాలకు (RSF) మధ్య జరుగుతున్న పోరు ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవతా సంక్షోభానికి దారితీసింది. ఈ యుద్ధంలో ఒక పక్షానికి పాకిస్థాన్ ఆయుధాలు సరఫరా చేయడం వల్ల పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని సౌదీ భావించింది. ఈ ఒప్పందానికి అవసరమైన నిధులను సౌదీ అరేబియానే భరించాల్సి ఉండటంతో, ప్రస్తుత పరిస్థితుల్లో నిధులు విడుదల చేయలేమని రియాద్ తెగేసి చెప్పింది. దీంతో ఆర్థికంగా సౌదీపై ఆధారపడ్డ పాకిస్థాన్, ఆ దేశం మాట కాదనలేక ఒప్పందాన్ని వెనక్కి తీసుకుంది. ఇదే సమయంలో సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఆఫ్రికాలోని వివిధ దేశాల్లో పరోక్షంగా జోక్యం చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ గొడవలకు దూరంగా ఉండాలని పాశ్చాత్య దేశాలు సౌదీకి సూచించడంతో రియాద్ తన వ్యూహాన్ని మార్చుకుంది. సూడాన్తో పాటు లిబియా నేషనల్ ఆర్మీతో కుదుర్చుకున్న 4 బిలియన్ డాలర్ల మరొక ఒప్పందం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడినట్లు సమాచారం.
పాకిస్థాన్ సైన్యానికి దెబ్బేనా
గత ఏడాది భారత్తో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవాలని పాకిస్థాన్ భావించింది. అందులో భాగంగానే పలు దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన సూడాన్ ఒప్పందం రద్దు కావడం పాక్ సైనిక వ్యూహాలకు పెద్ద అడ్డంకిగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎర్ర సముద్ర తీరంలో ఉండి, భారీగా బంగారం ఉత్పత్తి చేసే సూడాన్ దేశం ప్రస్తుతం విదేశీ శక్తుల జోక్యంతో ముక్కలయ్యే స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా దౌత్యపరమైన పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే పాకిస్థాన్ ఆయుధాలు అక్కడికి చేరకుండా అడ్డుకట్ట వేసిందని చెబుతున్నారు.
