Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారత వైమానిక దళంలో చేరబోతున్న యువ అధికారులకు అభినందనలు తెలియజేస్తూ దేశ రక్షణలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 245 మంది క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వియత్నాంకు చెందిన విదేశీ క్యాడెట్లను కూడా ప్రత్యేకంగా అభినందించారు. భారత ఎయిర్‌ఫోర్స్ అకాడమీ విదేశీ విద్యార్థులకు సైతం శిక్షణ అందించడం దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. భారత వైమానిక దళ చరిత్రను ప్రస్తావిస్తూ.. 1947-48లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఎయిర్‌ఫోర్స్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. అలాగే 1971 యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే విజయం సాధించడంలో భారత వైమానిక దళం పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఎయిర్‌ఫోర్స్‌లో మీరు అడుగుపెడుతున్నారని క్యాడెట్లకు చెప్పారు.

×
×
Ad

ప్రస్తుతం యుద్ధాల స్వరూపం పూర్తిగా మారిపోయిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఆయుధాలు, రాడార్లకు కూడా చిక్కకుండా దాడులు చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం సైనికాధికారులకు ఎంతో అవసరమని చెప్పారు. సరికొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని యువ అధికారులకు సూచించారు. ఇటీవల నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” సందర్భంగా భారత వైమానిక దళం ప్రదర్శించిన ధైర్యసాహసాలు, తెగువను ఆదర్శంగా తీసుకోవాలని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్థంగా పనిచేసే స్ఫూర్తిని అలవరుచుకోవాలని సూచించారు.

భారత ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కేవలం సైనిక శిక్షణకే పరిమితం కాకుండా.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాలకు పరిచయం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. విదేశీ క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా భారత దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత వైమానిక దళంలో కమిషన్ పొందబోతున్న మహిళా క్యాడెట్లను రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఎయిర్‌ఫోర్స్‌లో వారి ప్రవేశం “నారీ శక్తి”కి నిదర్శనమని కొనియాడారు. దేశ రక్షణలో మహిళల భాగస్వామ్యం మరింత బలపడుతోందని ఆయన అన్నారు. క్యాడెట్లందరూ తమ శిక్షణను దేశ సేవకు అంకితం చేసి, భారత వైమానిక దళ గొప్ప సంప్రదాయాలను కొనసాగించాలని రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు.