Maoists : బీజాపూర్ జిల్లా, ఊసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట కొండలలో కేంద్ర బలగాలు గత రెండు వారాలుగా విస్తృతంగా ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ‘ఆపరేషన్ కగార్’గా కొనసాగుతున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా CRPF యూనిట్లు, ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని గుట్టల మధ్య లోతైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం.. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నక్సలైట్ నేతలు, ముఖ్యంగా హిద్మా వంటి అగ్రశ్రేణి మావోయిస్టులను పట్టుకోవడం. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టుల ఉనికి ఉందన్న బలమైన సమాచారం మేరకు ముందుచూపుతో ఆపరేషన్ సాగుతోంది.
ఈ నేపథ్యంలో కర్రెగుట్టల్లో జరిగిన ఎన్ కౌంటర్లో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. CRPF ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పీ ఎన్కౌంటర్ను అధికారికంగా ధృవీకరించారు. ఇక ఓ మహిళా మావోయిస్టు మృతి చెందిన ఘటనలో అధికారులు 303 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు.
భద్రతా బలగాలు కర్రెగుట్టల గుట్టలపై ఆధిపత్యాన్ని సాధించాయి. ధోబే కొండలు, నీలం సరాయి ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేయగా, అలుబాక శివారులో మరో క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో డ్రోన్లు, సిగ్నలింగ్ టవర్లు ద్వారా మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలు భూగర్భ బంకర్ల వేట కొనసాగిస్తున్నాయి. వందల సంఖ్యలో మావోయిస్టులు ఈ ప్రాంతాల్లో బంకర్లు నిర్మించినట్లుగా సమాచారం అందడంతో, భద్రతా బలగాలు ప్రతి ఇంచు ఇంచుగా గాలిస్తున్నారు. మందుపాతరలు, IED బాంబులపై ప్రత్యేక నిఘా పెట్టి, ముందస్తు అపాయాన్ని నివారించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
CM Revanth Reddy: ఆపరేషన్ సింధూర్.. ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష