హిందువులు ఎంతో పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర మే 10 నుంచి మొదలు కానుంది. యాత్రంలో భాగంగా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని సందర్శించొచ్చు. పర్యటనక శాఖ అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. హరిద్వార్, రిషికేశ్లలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. భక్తుల సౌకర్యార్థం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ధర్మనగరిలోనూ ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో నమోదుకు ఇంటర్నెట్ సౌకర్యం, లైట్, విద్యుత్తో పాటు ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు, నీరు తదితర ఏర్పాట్లను చేశారు. వీటిపై ఒక్కో ధామ్కు 500 మంది యాత్రికుల పేర్లను నమోదు చేస్తారు. ధర్మనగరిలోని పర్యాటక శాఖ కార్యాలయ ఆవరణలోనూ ఆరు కౌంటర్లను ఏర్పాటు చేశారు. బద్రీనాథ్(Badrinath), కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ధామ్ యాత్రికుల కోసం ఐదు వందల స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.
READ MORE: Sanju Samson Out: అంపైర్తో గొడవ.. క్రీజ్ను వీడేందుకు ససేమిరా అన్న సంజూ శాంసన్!
ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రికుల కోసం ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. ప్రసిద్ధిగాంచిన గంగోత్రి, యమునోత్రి ధామ్ లు మే 10 నుంచి తెరుచుకోనున్నాయి. దీంతో ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. మరోవైపు ఇప్పటికే అనేక మంది భక్తులు ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. రోష్నాబాద్లోని ఆర్టీవో కార్యాలయ ఆవరణ నుంచి చార్ధామ్ యాత్రికులు వచ్చే వాహనాలకు గ్రీన్కార్డులు ఇవ్వనున్నారు. గ్రీన్కార్డుల తయారీకి ఆ శాఖ ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసింది. దీంతో చార్ధామ్ యాత్రకు వచ్చే డ్రైవర్లు సులభంగా గ్రీన్ కార్డ్లు పొందవచ్చు. యాత్రికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అనంతరం యాత్ర కార్డ్ జారీ చేస్తారు. అలాగే, ప్రతి సందర్శకులను జీపీఎస్ (GPS) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ కూడా ఉంటుంది. యాత్రికుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. యాత్రికులు చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ కార్డ్ని ఉపయోగించి ఆహారం మరియు బస వంటి ప్రభుత్వ ప్రత్యేక సౌకర్యాలను కూడా పొందవచ్చు.