అధికారం చేతిలో ఉన్నప్పుడు అంతన్నాడింతన్నాడు. నా అంతటోళ్ళు లేరన్నాడు. రాజకీయ ప్రత్యర్థుల మీదికి తొడగొట్టాడు. మీసం మెలేశాడు…. కట్ చేస్తే ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయారా మాజీ మంత్రి. దాంతో వేషాలన్నీ పవర్ ఉన్నప్పుడేనా? అంతా గాలి బుడగ సామెతేనా అంటూ సెటైర్స్ పడుతున్నాయట. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏంటా కహానీ? నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. కార్పొరేటర్గా ఉన్న తన బాబాయ్ చనిపోవడంతో… జరిగిన ఉప ఎన్నికలో అదే సీటు నుంచి పోటీ చేసి గెలిచారాయన. 2009 ఎన్నికలలో బీ.సీ.లకు ప్రాధాన్యం ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి నిర్ణయించడంతో… నెల్లూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఆ తర్వాత జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్రల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాక అనిల్ తీరే మారిపోయిందని అంటారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో… సందర్భంతో నిమిత్తం లేకుండా సందు దొరికితే చాలు… ఇటు టీడీపీ, అటు జనసేన నేతల మీద విరుచుకుపడేవారు. అసెంబ్లీలో తొడలు కొట్టడం.. సవాళ్లు విసరడం… లాంటి చేష్టలతో చర్చల్లో నిలిచేవారు అనిల్. ఇక 2019 ఎన్నికల్లో ఆయన మరోసారి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలవడం, అప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో… అనిల్ నోటికి హద్దే లేకుండా పోయిందని చెప్పుకుంటారు. జిల్లాకు చెందిన సీనియర్స్ని కూడా పక్కనపెట్టి తనకు మంత్రి పదవి ఇవ్వడంతో చెలరేగిపోయారు అనిల్ కుమార్ యాదవ్. ఆ క్రమంలో జిల్లాకు చెందిన పలువురు నేతలు ఆయనకు దూరమయ్యారు. మూడేళ్ల తర్వాత అనిల్ కుమార్ స్థానంలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి జిల్లాలో పార్టీ నాయకులు, అనిల్ కు మధ్య అంతరం పెరిగింది. ఈ సమయంలో తెల్లరాయి తవ్వకాలు.. అమ్మకాలకు సంబంధించి అనిల్ కు బాధ్యతలు అప్పగించడాన్ని జిల్లా వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారట. గత ఎన్నికల్లో… అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు సిటీ నుంచి తప్పించి నరసరావుపేట లోక్సభ అభ్యర్థిగా పంపింది వైసీపీ అదిష్టానం.
దీంతో ఆయన్ని జిల్లా నుంచి పంపించేశామంటూ అప్పట్లో కొందరు వైసిపి నేతలు హ్యాపీగా ఫీలయ్యారట కూడా. తాను నరసరావుపేటకు వెళ్ళినప్పటికీ వారంలో రెండు రోజులు నెల్లూరులోనే ఉంటూ… పార్టీ నేతలు… కార్యకర్తల్ని కలుస్తానని అనిల్ ప్రకటించారు. ఇదే సమయంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా తన అనుచరుడైన ఖలీల్ అహ్మద్ పేరును ఖరారు చేసేలా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించారాయన. అయితే… సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ ఓడిపోయారు. రాష్ట్రంలో పార్టీకి కూడా పవర్ పోయింది. అప్పటి నుంచి రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు మాజీ మంత్రి. చెన్నైకి మకాం మార్చేసి సొంత వ్యాపారాలు చేసుకుంటూ… అసలు పాలిటిక్స్లో ఉన్నాడా లేడా అన్నట్టుగా మారిపోయారు. దీంతో నెల్లూరు పొలిటికల్స్లో సరికొత్త చర్చ మొదలైంది. అధికారం ఉన్నప్పుడు అంతన్నాడింతన్నాడు. ఇప్పుడు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. మీసాలు తిప్పడాలు, తొడలు కొట్టడాలన్నీ పవర్ ఉంటేనేనా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. నాడు విర్రవీగిందంతా…. ఉత్తిత్తు బుస్సేనా అని నెల్లూరులోనే మాట్లాడుకుంటున్నారట. ఈ మేటర్ తన చెవిన పడిందా అన్నట్టుగా… ఇటీవల ఒక సందర్భంలో నెల్లూరు వచ్చిన అనిల్ ఇది తాత్కాలిక విరామం మాత్రమేనని అన్నారట. అయితే అందుకు కూడా కౌంటర్స్ పడుతున్నట్టు తెలిసింది. తాత్కాలికం అంటే…. కూటమి అధికారంలో ఉన్నన్నాళ్ళా అని వెటకారంగా ప్రశ్నించే వాళ్ళు సిటీ వైసీపీలోనే ఉన్నారట. చెన్నై నుంచి వచ్చినప్పుడు కూడా…. కేవలం సన్నిహితుల్ని తప్ప మిగతా ఎవ్వర్నీ మాజీ మంత్రి కలవడంలేదని తెలిసింది. అటు నెల్లూరు సిటీ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు జగన్. దీంతో ఆయన నియోజకవర్గ నేతలతో సమావేశమవుతూ కలిసిపోతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ నెల్లూరు రాజకీయాల్లో పాల్గొనే అవకాశం లేదని భావించిన ఆయన అనుచరులు… చంద్రశేఖర్ రెడ్డికి మద్దతు ఇస్తూ అటువైపు మొగ్గుతున్నట్టు తెలుస్తోంది. అలా…అనుచరులు కూడా దూరం కావడంతో..భవిష్యత్ లో అనిల్ రాజకీయ వ్యూహం ఏ విధంగా ఉంటుందనేది చూడాలంటున్నారు పరిశీలకులు.