తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ సీట్లకుగాను 15 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. అందులో ఎక్కువ మంది కొత్తగా పార్టీలో చేరిన వారే. అసలు కొందరైతే… కేవలం సీటు కోసమే… ఇటీవల పార్టీలో చేరారన్న టాక్ నడుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన ఏడుగురు అభ్యర్థుల్ని అదే కోణంలో చూస్తున్నాయట కాషాయ శ్రేణులు. అందుకే క్షేత్ర స్థాయిలో వారికి సహకరించడం లేదన్న ఫీడ్ బ్యాక్ వస్తోందట పార్టీ రాష్ట్ర కార్యాలయానికి. కేవలం పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పార్టీలో చేరిన నేతలకు బీజేపీ సిద్ధాంతాలు, పద్ధతుల గురించి ఏం పట్టింపు ఉంటుంది? రేపు ఒకవేళ ఓడిపోతే వాళ్ళు పార్టీనే అంటిపెట్టుకుని ఉంటారా? లేక తమదారి తాము చూసుకుంటారా అని కూడా నాయకుల్ని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ప్రధాని మోడీ ఐదు విజయ సంకల్ప సభల్లో పాల్గొన్నారు.
అభ్యర్థులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. కేడర్తో సమన్వయలేమి వాళ్లకు ప్రధాన సమస్య అవుతోందట. జహీరాబాద్ లాంటి చోట్ల ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు. ఇక్కడ అభ్యర్థి బీబీ పాటిల్… బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి తొలిసారి నియోజకవర్గానికి వస్తే… పాత బీజేపీ లీడర్స్ కనీసం స్వాగతం చెప్పడానికి కూడా రాలేదట. ఇక ఎన్నికల ప్రచారంలో కలిసి తిరిగేది ఎక్కడన్న ప్రశ్న వస్తోంది. ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉందని, స్థానిక నేతలు కొత్త అభ్యర్థులకు సహకరించకపోగా అస్సలు ఎడమొహం పెడ మొహంగా ఉంటున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు కూడా కొత్త అభ్యర్థుల్ని పట్టించుకోవడం లేదని అంటున్నారు. అలాగే టికెట్ ఆశించి భంగపడ్డవారు కూడా అంటీ ముట్టనట్లు ఉంటున్నట్టు తెలిసింది. అభ్యర్థులు వచ్చి కలుస్తామని అంటున్నా టైం ఇవ్వడం లేదట కొందరు నియోజకవర్గ ముఖ్య నేతలు. దీంతో లబోదిబోమంటున్న క్యాండిడేట్స్….. మేటర్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిసింది. కొన్ని చోట్ల పార్లమెంట్ ఇంఛార్జిలని మార్చాలని కోరినట్టు ప్రచారం ఉంది. వెంటనే పార్టీ పెద్దలు పట్టించుకుని చక్కదిద్దకుంటే… ప్రచారం మీద ప్రభావం పడుతుందని, నేతలు, కార్యకర్తలు మనస్ఫూర్తిగా కలిసి తిరిగే వాతావరణం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో కనుక్కుని అక్కడ అభ్యర్థులు , పార్టీ కార్యకర్తలతో… వెంటనే సమన్వయ సమావేశాలు పెట్టకుంటే మొదటితే మోసం వస్తుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.