Off The Record: ఎంత ప్రాధాన్యం ఉన్నా….. కక్షలు, కార్పణ్యాలు, దాడుల్లాంటివి లేకుండా నడిచిపోతుంటాయి సింహపురి పాలిటిక్స్. అందుకే నెల్లూరు జిల్లాలో ఉద్యోగం చేసేందుకు పోలీస్ అధికారులు పోటీ పడుతుంటారు. అయితే అదంతా ఒకప్పటి మాట అంటున్నారు తాజా పరిస్థితులను గమనిస్తున్న వారు. ఇప్పుడంతా సీన్ మారిపోయిందని, పొలిటికల్ అడకత్తెరలో ఇరుక్కుని విలవిల్లాడుతున్నామని తల బాదుకుంటున్నారట పోలీస్ ఆఫీసర్స్. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక వివిధ ఆరోపణలతో వైసీపీకి చెందిన పలువురు నాయకుల మీద కేసులు బుక్ అయ్యాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు జైలుకు వెళ్ళి వచ్చారు. అటు కావలి, కోవూరు మాజీ ఎమ్మెల్యేలపై కూడా కేసులు నమోదు అవ్వడంతో వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ ఎపిసోడ్స్ అన్నిటిలో… పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు. కొందరైతే…మేం అధికారంలోకి రాగానే ఇప్పుడు అక్రమ కేసులు పెట్టిన పోలీసులను వదిలే ప్రసక్తే లేదంటూ వార్నింగులు సైతం ఇస్తున్నారు. అలాంటి వాళ్ళకు భవిష్యత్లో పోస్టింగులు ఉండమంటూ వైసీపీ లీడర్స్ చేస్తున్న వ్యాఖ్యలు డిపార్ట్మెంట్లో కలకలం రేపుతున్నాయట. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాము కోపం అన్నట్లు తమ పరిస్తితి తయారైందంటూ జిల్లా పోలీసులు ఆవేదనగా ఉన్నారు. సరిగ్గా ఇక్కడే డిపార్ట్మెంట్లో చీలిక కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు.
కొందరు పోలీసులు ఎమ్మెల్యేలను మేనేజ్ చేసుకుని.. డ్యూటీలు చేస్తుంటే.. మరికొందరు వైసీపీ నేతలకు టచ్ లోకి వెళ్తున్నారట. ఇక ఏమీ చేయలేని ఇంకొందరు మాత్రం మొండిగా అలాగే ముందుకుపోతున్నారన్నది డిపార్ట్మెంట్ టాక్. జరుగుతున్న వ్యవహారాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, పై నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే తాము ఫాలో అవుతున్నామని ఫ్యాన్ పార్టీ నేతల చెవిలో ఊదేస్తున్న పోలీసులు కూడా ఉన్నారట. ఇచ్చిన టాస్క్ పూర్తి చెయ్యకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారనే భయంతో ముందుకు వెళ్ళాల్సి వస్తోందే తప్ప… మీమీద ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు, అర్ధం చేసుకోండని వైసీపీ నాయకులకు విన్నవించుకుంటున్నారట కొందరు. ఇటీవల నాయుడుపేట సీఐ ఏసీబీకి దొరికిన ఘటనలో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయమే కారణమని పోలీసులు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ నేత ఆదేశించాడని.. వైసీపీకి చెందిన ఓ నేతను సీఐ ఇబ్బంది పెట్టాడట.. అది మనసులో పెట్టుకున్న సదరు వైసీపీ నేత చాకచక్యంగా వ్యవహరించి సీఐని నెలవారీ మామూళ్లకు ఒప్పించి ఏసీబీకి పట్టించారన్నది ఇంటర్నల్ టాక్. ఇలా తమ ఉద్యోగాలు అడకత్తెరలో ఉన్నాయన్న ఆవేదన వ్యక్తం అవుతోంది పోలీస్ వర్గాల్లో. వీఆర్కు వెళితే జీతాలు కూడా ఉండవని, డ్యూటీలో ఉంటే కేసుల పాలిట్రిక్స్తో తలనొప్పులు వస్తున్నాయని సన్నిహితులు వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
మరో రెండు మూడు ఏళ్లలో రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు వైసీపీ వార్నింగ్స్కు భయపడకుండా ఉంటే.. కొందరు మాత్రం భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని రెండు పక్కలా నేను మీ వాడినే సర్ అని చెప్పుకుంటూ బండి లాగించేస్తున్నట్టు తెలుస్తోంది. తాము చెప్పినట్టు వినలేదని ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలీసులను బదిలీలు చేశారన్న ప్రచారం సైతం ఉంది. నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతంగా ఉంటుందని వచ్చామని.. ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధంతో కుంపటి మీద కూర్చున్నట్టు ఉందన్నది పోలీస్ ఆఫీసర్స్ మాట. ఉన్నోళ్ళంతా పెద్దారెడ్లే కావడంతో యే పుట్టలో ఏ పాము ఉందో, ఎక్కడ టచ్ చేస్తే ఎట్నుంచి కాటు, వేటు పడతాయో అర్థంగాక చాలా మంది లో ప్రొఫైల్ మెయిన్టెయిన్ చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నట్టు సమాచారం. ఏరియా బాగుంటుందని పోస్టింగ్స్ ఇప్పించుకుంటే….. ఏంది సామీ ఈ పాడు పాలిటిక్స్ అంటూ మధనపడుతున్నారు సింహపురి పోలీసులు. ఇప్పటికే కొందరు ప్రాధాన్యత లేని, ఫోకస్కాని పోస్టింగ్స్లోకి వెళ్ళిపోగా.. మరికొందరు కూడా అదే ప్లాన్లో ఉన్నారట.
పొలిటికల్ అడకత్తెరలో నెల్లూరు పోలీసులు..#
వైసీపీ నేతల మీద వరుస కేసులతో ఇరకాటం#
పోలీసుల అత్యుత్సాహం అంటూ వైసీపీ ఆగ్రహం#
మేం అధికారంలోకి వచ్చాక వదిలేది లేదంటూ వార్నింగ్స్#
కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్టు#
టీడీపీ ఎమ్మెల్యేలను మేనేజ్ చేసుకుంటున్న కొందరు?#
కామ్గా వైసీపీ లీడర్స్తో టచ్లోకి మరి కొందరు పోలీసులు#
ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నామని ఫ్యాన్ లీడర్స్తో మంతనాలు#
నాయుడుపేట సీఐ ఏసీబీకి దొరకడం వెనక రాజకీయం ఉందా?#
పథకం ప్రకారం నెలవారీ మామూళ్ళకు ఒప్పించి పట్టించారా?#
రెండు మూడేళ్ళలో రిటైర్ అయ్యేవాళ్ళు మాత్రం ధైర్యంగా డ్యూటీ..#
మీ వాడినేనని రెండు వైపులా మేనేజ్ చేసుకుంటున్న కొందరు..