NTV Telugu Site icon

Off The Record: తెలంగాణ పీసీసీ కొత్త స్కెచ్..!

Tpcc

Tpcc

Off The Record: పవర్‌లో ఉన్నా… చాలా విషయాల్లో పైచేయి అవలేకపోతున్నామని ఫీలవుతున్నారట తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పెద్దలు. ప్రజలకు మంచి చేస్తున్నా… అది వెళ్ళాల్సినంత ఎక్కువగా వెళ్ళడం లేదన్న చర్చ పార్టీలో గట్టిగానే జరుగుతోందంటున్నారు. ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉన్న… విచ్చలవిడిగా పని చేసిన పార్టీ శ్రేణులు అధికారంలోకి వచ్చాక కాస్త సైలెంట్‌గా ఉంటున్నాయన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉందట. చివరికి ప్రతిపక్షాల విమర్శల్ని సైతం దీటుగా తిప్పికొట్టలేకపోతున్నామన్న అభిప్రాయం గాంధీభవన్‌ పెద్దల్లో ఉందంటున్నారు. సోషల్ మీడియాలో గతంలో పనిచేసిన టీం ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లడంలో వెనుకబడ్డామన్న అభిప్రాయం ఉన్నట్టు తెలిసింది. గతంలో మాదిరిగా ఇప్పుడు అందరూ ఓన్‌ చేసుకోవడానికి కొంత ఆలస్యం అవుతుందనే భావనలో పార్టీ నాయకత్వం ఉన్నప్పటికీ… సోషల్ మీడియాని మరింత యాక్టివేట్‌ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో..

Read Also: Delhi: మెడికల్ బిల్లుపై ఘర్షణ.. వైద్యుడిని చంపిన ముగ్గురు మైనర్లు

పార్టీ ప్రక్షాళన దిశగా పీసీసీ కొత్త చీఫ్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే అధికార ప్రతినిధుల విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్న ఆలోచనతో ఉన్నారట ఆయన. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు ప్రతిపక్షాలని గట్టిగా ఎదుర్కోలేకపోతున్నారన్న అభిప్రాయం సైతం ఉందట. అలాగే కౌంటర్ వేయటానికి ప్రస్తుతం ఉన్న అధికార ప్రతినిధుల్లో చాలామందికి ఆ స్టేచర్‌ సరిపోవటం లేదన్న ఫీలింగ్ సైతం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అపోజిషన్‌కు కౌంటర్స్‌ ఇస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లడం లేదన్న ఫీలింగ్‌ పార్టీ పెద్దల్లో పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే ప్రక్షాళనలో అధికార ప్రతినిధులను కీలకంగా చూడాలని భావిస్తోందట పీసీసీ. ఆ క్రమంలోనే సీనియర్ ఎమ్మెల్యేలకు అధికార ప్రతినిధుల పదవులు కట్టబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేలు అధికార ప్రతినిధులుగా ఉంటే…వాళ్ళ పలుకుబడి, వాగ్ధాటి, అవగాహనతో మీడియాలో ఫోకస్ అవడంతో పాటు ప్రతిపక్షాలకు కూడా గట్టిగా సమాధానం చెప్పినట్టు అవుతుందన్న ఫీలింగ్ ఉందంటున్నారు.

Read Also: Israel: మరొక హిజ్బుల్లా కీలక నేతని ఖతం చేసిన ఇజ్రాయిల్..

అలాగే సీనియర్‌ ఎమ్మెల్యేలకు సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది కాబట్టి సమాధానం కూడా గట్టిగానే ఇవ్వొచ్చన్నది పీసీసీ పెద్దల ఫీలింగ్‌ అట. అందుకే ప్రక్షాళనలో అధికార ప్రతినిధులు కీలకంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వ విప్‌లు మాత్రమే స్పందిస్తున్నారు. కానీ… అన్నిటికీ వాళ్లే స్పందించడం కంటే పార్టీ తరఫున కూడా గట్టి కౌంటర్ ఉండాలనే ఆలోచనతో ఉంది పార్టీ నాయకత్వం. దాంట్లో భాగంగానే సీనియర్ ఎమ్మెల్యేలని అధికార ప్రతినిధులుగా కేటాయించాలనుకుంటున్నట్టు తెలిసింది. అలా చేస్తే… వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ ప్రాధాన్యం ఇచ్చినట్టు కూడా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. మొత్తంగా ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీని అనుసంధానం చేస్తూ… కొత్త మార్పు తీసుకు రావాలన్నది పీసీసీ ప్లాన్‌గా తెలుస్తోంది.