Site icon NTV Telugu

Off The Record: మంత్రి వర్సెస్‌ ప్రభుత్వ విప్.. సీఐ పోస్ట్ పంచాయతీ..!

Puvvada Ajay

Puvvada Ajay

Off The Record: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీస్‌ పోస్టింగ్స్‌ ఇద్దరు ప్రభుత్వ పెద్దల మధ్య చిచ్చు పెడుతున్నాయట. నేను చెప్పిన వాళ్ళకంటే… నేను చెప్పిన వాళ్లకే పోస్టింగ్స్‌ ఇవ్వాలని ఓవైపు మంత్రి పువ్వాడ అజయ్‌, మరోవైపు ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు పట్టుబడుతుండటంతో… పోలీస్‌ పెద్దలు కూడా తలలు పట్టుకుంటున్నారట. భద్రాద్రి జిల్లాలో నేను చెప్పిన వారికే పోస్టింగ్స్‌ ఇవ్వాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా అయిన కాంతారావు అధికారుల్ని వత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల వేళ తనకు అనుకూలంగా ఉండే అధికారుల కోసం, ప్రత్యేకించి పోలీస్‌ విభాగంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట విప్‌. కొన్ని చోట్ల లోకల్‌ ఎంఎల్ఎల ఇష్ట పూర్వకంగా, మరి కొన్నిచోట్ల బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి హోదాలో రేగా పదవులు ఇప్పించుకున్నట్టు తెలిసింది. జిల్లాలో సిఐ, ఎస్‌ఐల పోస్టింగ్స్‌ అన్నీ… దాదాపు ఇలాగే ట్రాన్స్‌ఫర్స్‌ జరిగినట్టు చెప్పుకుంటున్నారు. అయితే భద్రాచలం సిఐ విషయంలో మాత్రం పీటముడి పడిందట. మంత్రి అజయ్ కుమార్ జోక్యంతో ఇక్కడ సమస్య వచ్చిందట. భద్రాచలం రాజకీయం అంతా మంత్రి అజయ్ కుమార్ కను సన్నల్లో సాగుతోంది. ఇదే నియోజకవర్గంలో రేగా కాంతారావు కూడా అనుచర గణాన్ని పెంచుకుంటూపోతున్నారు. ఈ పరిధిలో మంత్రికి బంధుగణం ఎక్కువగా ఉంది.

ఆయన అమ్మమ్మ ఊరు కూడా ఇదే ప్రాంతం కావడంతో బంధుత్వం గట్టిగానే ఉంది. మరోవైపు ఇక్కడపనిచేసేవారికి ఉన్నతాధికారుల తో మంచి సంబంధాలు ఏర్పడతాయి. అందుకే ఇక్కడ పోస్టింగ్‌ కోసం పైరవీలు గట్టిగానే చేసుకుంటారు. అందుకే భద్రాచలం సీఐ విషయంలో నాయకులిద్దరూ పంతాలకు పోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఇక్కడ పింగళి నాగ రాజు రెడ్డి సీఐగా ఉన్నారు. ఆయన బదిలీకి రంగం సిద్ధం కావడంతో కొత్తగా వచ్చేవారు మా వాళ్ళు ఉండాలంటే మా వాళ్ళే రావాలంటూ… రెండు వర్గాలు పట్టుబడుతున్నాయట.

నేను చెప్పిన వారికే పోస్టింగ్ ఇవ్వాలని రేగా కాంతారావు, మంత్రిగా నా మాటే నెగ్గాలని అజయ్‌ ఎస్పీ మీద వత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో జిల్లా మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తయినా…. భద్రాచలం సీఐ పీటముడి మాత్రం అలాగే మిగిలిపోయిందట. ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదురుతుందా? లేక ఉన్నతాధికారులు రాష్ట్ర మంత్రిగా అజయ్‌ వైపు మొగ్గు చూపుతారా అన్నది సస్పెన్స్‌గా మారింది. అటు పోలీస్‌ అధికారుల ఆలోచన మాత్రం మరోలా ఉందట. ఈ రాజకీయ గోల పక్కనపెడితే…భద్రాచలం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అయినందున ఎస్ ఐ బి లో పని చేస్తున్న ఎవరైనా అధికారిని ఎంపిక చేసి పోస్టింగ్‌ ఇస్తే బాగుంటుందన్నది వారి మాటగా తెలిసింది. చివరికి ఈ పీట ముడిని ఎవరు? ఎలా విప్పుతారో చూడాలి.

Exit mobile version