Off The Record: ఎమ్మార్వో ఆఫీసులు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. ఇతరత్రా గవర్నమెంట్ ఆఫీసులు…ఇలా ఎక్కడైతే ఉద్యోగుల చేతివాటానికి ఆస్కారం ఉంటుందో.. అలాంటి ప్రతి చోట ఏపీ ఏసీబీ విరుచుకుపడుతోంది. సోదాలు నిర్వహిస్తోంది. ఆ దాడులకు భయపడి కొందరు ఉద్యోగులు సెలవులు కూడా పెట్టేశారట. అప్పుడెప్పుడో.. రెండేళ్ళ క్రితం ఇదే తరహాలో హడావుడి చేసిన ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ ఇన్నాళ్ళు ఎందుకు నిద్ర నటించింది? మళ్ళీ ఇప్పుడే ఎందుకు కళ్ళు నులుముకుంటూ లేచిందంటే…దాని వెనక లంబా చౌడా స్టోరీ ఉందట. అదే ఇప్పుడు ఉద్యోగుల్లో హాట్ టాపిక్.
సీఎం జగన్మోహన్రెడ్డి ఇటీవల ఓ సమీక్ష నిర్వహించారు. ఏసీబీ పని తీరు ఏ మాత్రం బాగాలేదని ఆ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని పర్యవసానమేనట ఈ హడావిడి అంతా. ప్రస్తుతం ఏసీబీ… తాత్కాలిక డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఉంది. ఇక నుంచి ఆ బాధ్యతలను ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్కు అప్పజెప్పాలని సూచించారు సీఎం. అయితే ఇంకా బాధ్యతల బదిలీ జరగలేదు. ఇటు రవిశంకర్కు గాని, అటు వేరే వారికి కానీ అప్పజెప్పలేదు. ప్రక్రియ ఇంకా కొనసాగుతోందట. ఈలోగా డీజీ రాజేంద్రనాధ్ రెడ్డి ఏసీబీని యాక్టివేట్ చేయడంతో ప్రభుత్వ కార్యాలయాలపై విరుచుకుపడుతున్నారన్నది ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
అయితే ఎవరెవరు.. ఏయే డ్యూటీలు చేయాలి? వారు సక్రమంగా చేస్తున్నారా..? లేదా..? అన్న విషయాలను కూడా నేరుగా ముఖ్యమంత్రే చూడాలా? ఉన్నతాధికారులంతా ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. అధికారం చేపట్టిన తొలిరోజుల్లోనే.. లైన్ డిపార్ట్మెంట్లు.. ప్రజలతో నేరుగా అనుసంధానం ఉండే శాఖల్ని ఎంపిక చేసి అక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికలు రూపొందించారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఇందుకోసం ప్రత్యేక నివేదికలు కూడా తెప్పించుకుంది ఏపీ సర్కార్. తర్వాత వాటిని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవట. ఇలా.. సీఎం సంకల్పించి ఆ బాధ్యతలను అధికారులకు అప్పజెప్పినా పూర్తిగా గాలికి వదిలేశారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సవాలక్ష తలనొప్పులతో ఉన్న సీఎం ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టి.. పనితీరు బాగోలేదని చెప్పేంత వరకు ఉన్నతాధికారులు పట్టించుకోకుంటే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సీఎం హెచ్చరించేదాకా కదలరా అనే విమర్శలు వస్తున్నాయి.
ఇదే సందర్భంలో మరో చర్చ కూడా జరుగుతోంది. సీఎం ఆదేశాల మేరకు.. ఏసీబీ బాధ్యతలను రవిశంకర్ అయ్యన్నార్కు కానీ.. వేరే వారికి కానీ అప్పజెప్పాలంటే సాంకేతిక సమస్యలు వస్తున్నాయట. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి అసలు పోస్టింగ్ ఏసీబీ డీజీ. దాన్ని వేరే వారికి అప్పజెబితే ఎఫ్ఎసీగా కొనసాగడం సాంకేతికంగా ఇబ్బందికర వ్యవహారమట. అసలు పోస్టింగ్ లేకుండా అదనపు బాధ్యతలు చేపట్టడం నిబంధనల ప్రకారం కుదరదు. ఈ క్రమంలో డీజీకి వేరేశాఖనైనా అప్పగించి.. కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలా కాకుండా.. నేరుగా డీజీపీ పదవినే అసలు పోస్టింగ్లా ఇవ్వాలంటే దీనికి డీవోపీటీ అనుమతి కావాలి. అందుకు కసిరెడ్డి సీనియార్టీ అడ్డం వస్తోంది. ఆయనకంటే సీనియర్స్ చాలా మంది డీజీపీ పదవి రేసులో ఉన్నారట. వారిని కాదని రాజేంద్రనాథ్రెడ్డి కోసం అనుమతి సాధించడం సాధ్యం అవకపోవడంతో ఏం చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నారట ప్రభుత్వ పెద్దలు. ఏదేమైనా సీఎం ఆదేశాల తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పరుల భరతం పట్టే దిశగా పరుగులు పెడుతోంది ఏసీబీ.