Allahabad High Court: లవ్ మ్యారేజీలపై అలహాబాద్ హైకోర్ట్ సంచలన తీర్పు..

  • మేజర్లు తమకు ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు: అలహాబాద్ హైకోర్టు..
  • ఓ ప్రేమ పెళ్లి విషయంలో భర్తపై భార్య బంధువులు పెట్టిన కిడ్నాప్ కేసును కొట్టివేసిన న్యాయస్థానం..
  • కుటుంబ సభ్యుల నుంచి భార్యకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలు
Allahabad Hc

Allahabad Hc

మేజర్లను తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోనియ్యకుండా, ఇష్టమైన చోట బతకకుండా ఎవరూ ఆపలేరని అలహాబాద్ హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తోందని తెలిపింది. మేజర్లైన ఓ జంట ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోగా.. భార్య తరపు బంధువులు భర్తపై కిడ్నాప్ కేసు పెట్టడాన్ని న్యాయస్థానం తోసిపుచ్చుతూ ఈ కామెంట్స్ చేసింది. భార్య మేనమామ ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేయడమే కాకుండా.. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ భార్య వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాత కూడా ఆమెను తల్లిదండ్రుల ఇంటికి తిరిగి పంపడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పు బట్టింది.

Read Also: Kishan Reddy: గత పదేండ్లలో ప్రధాని మోడీ విద్యుత్ కొరతకు చెక్ పెట్టారు..

కాగా, 21 ఏళ్ల వయసున్న ముస్లిం యువతి ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో తనకు నచ్చిన వ్యక్తిని తమ మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చింది. అయితే, భార్య మేనమామ ఐపీసీ సెక్షన్ 363 కింద పెళ్లి కొడుకుపై కిడ్నాప్ కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా అతడ్ని అరెస్ట్ చేశారు. దీంతో పాటు భార్యను కూడా అరెస్ట్ చేసి ఆమెను మేనమామకు అప్పగించేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద భార్య వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పోలీసులు ఆమెను మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. అయితే, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, తన భర్తను తప్పుడు కేసులో ఇరికించారని వాంగ్మూలం ఇచ్చింది. అయిన కూడా పోలీసులు సదరు ముస్లిం యువతిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.

Read Also: Rammohan Naidu: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు

దీంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చినా తనను ఇంటికి పంపించారు.. తనకు ప్రాణహాని ఉందని భార్య తెలపగా.. మేనమామ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వెల్లడించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. యువతిని చంపుతానన్న ఆమె మేనమామపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పేర్కొనింది. అలాగే, ఆ జంటకు భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.