నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ గ్రామంలో 2023లో జరిగిన హత్య ఘటనలో జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కూతుర్ని చంపిన తండ్రికి జీవిత ఖైదు విధించింది. మరో నిందితుడికి రూ.2,000 జరిమానా విధించింది. భార్యపై అనుమానమే హత్యకు కారణమని జిల్లా కోర్టు నిర్ధారించి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన కడమంచి కాశీరాం, పోసాని దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తుంటారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.. సమ్మక్క, సారక్క. కొన్నాళ్లకు భర్త పట్టించుకోక పోవటంతో పోసాని నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్కు చేరుకుని స్థానికంగా యాచిస్తూ జీవనం కొనసాగిస్తోంది.
Also Read:Mukesh Ambani: బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టడం తెలివితక్కువ పనే.. మీరు డబ్బు సంపాదించాలనుకుంటే..
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మెట్పల్లి ప్రశాంత్తో పరిచయం ఏర్పడింది. ఈ విషయం కాశీరాంకు తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయి అక్కడకు చేరుకుని భార్యపై ఆగ్రహంతో చిన్న కుమార్తె సారక్క(9)ను మంటల్లోకి నెట్టాడు. అది చూసి భయపడిన పెద్దమ్మాయి సమ్మక్క పరారైంది. తీవ్రంగా గాయపడిన సారక్కను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందింది. భార్య ఫిర్యాదుతో కాశీరాంపై మెండోరా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.