Site icon NTV Telugu

Nitish Kumar: ముగిసిన నితీష్ శకం.. నేడు ఎంపీగా ప్రమాణ స్వీకారం.. నెక్ట్స్‌ సీఎం ఇతడేనా?

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: నేడు బీహార్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోనుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం, నితీష్ కుమార్ ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి పాట్నాకు తిరిగి వస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుంది. నితీష్ కుమార్ ఇప్పటికే మార్చి 30న తన బీహార్ శాసన మండలి (MLC) సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తారని సీనియర్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం మారినా, పాలన మాత్రం గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న ‘నితీష్ మోడల్’ ఆధారంగానే సాగుతుందని ఆయన పేర్కొనడం గమనార్హం.

READ MORE: Realme C100 4G: 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. కొత్త రియల్‌మీ ఫోన్ విడుదల

నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్లడంతో ఇప్పుడు బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పాట్నాలోని బీజేపీ కార్యాలయం వెలుపల ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ ‘వాల్మీకి సమాజ్’ పేరుతో కొన్ని పోస్టర్లు వెలిశాయి. అయితే పార్టీ కార్యాలయ సిబ్బంది వెంటనే వాటిని తొలగించినప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ మార్పుల సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, నాయకత్వంపై చర్చించేందుకు బీజేపీ అధిష్టానం నేడు ఢిల్లీలో ‘కోర్ గ్రూప్’ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో పాల్గొనేందుకు బీహార్ డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఏప్రిల్ 14న జరగనున్న ఎన్డీయే (NDA) శాసనసభాపక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి పేరుపై అధికారిక ముద్ర పడే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version