Nisha Mehta: ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థిని ఒకరు ఇప్పుడు ఏకంగా నేపాల్ ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. మీరు చదివేది నిజమే.. ప్రస్తుతం పక్క దేశం అయిన నేపాల్ కొత్త ప్రభుత్వం కొలువు దీరిన విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధానిగా బాలెన్ షా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న నిషా మెహతా.. తాజాగా నేపాల్ ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. నిజానికి ఆమెకు భారతదేశంతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఆమె తన బాల్యం నుంచే ఆరోగ్య సంరక్షణ రంగంలో చురుకుగా ఉన్నారు. నర్సింగ్ వృత్తి తర్వాత ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు.
READ ALSO: ‘ఈ శరీరం నాదే కానీ ఇందులో నేను లేను..’ ఇండియాలో ట్రాన్స్జెండర్ల సర్జరీల వెనుక నమ్మలేని నిజాలు
ప్రస్తుతం నేపాల్లో పాలక పార్టీగా ఉన్న RSP ఆరంభం నుంచి ఆమె అందులో ఒక సాధారణ సభ్యురాలిగా కొనసాగారు. 2022 సార్వత్రిక ఎన్నికల కోసం ఆర్ఎస్పి ఆమెను బరిలోకిదించింది. ఆ ఎన్నికల్లో నిషా నేపాలీ పార్లమెంటులో సీటు దక్కించుకోవడంలో విఫలమయ్యారు. అయితే, ఈసారి ఆమె ఫెడరల్ పార్లమెంటులోకి ప్రవేశించి ఏకంగా ప్రధానమంత్రి బాలేంద్ర షా నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఎన్నికైయ్యారు.
భారతదేశంతో ఆమెకు ఉన్న సంబంధం..
ఆమె ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు అనుబంధంగా ఉన్న కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో చదువుకున్నారు. నర్సింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, నిషా మెహతా తిరిగి నేపాల్కు వచ్చి బిరాట్నగర్లోని బిరాట్ టీచింగ్ హాస్పిటల్లో పనిచేశారు. అనంతరం ఆమె కోషిలోని నేపాల్ పోలీస్ వైవ్స్ అసోసియేషన్కు పరిపాలనా కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆమె అక్కడ, మహిళలు, పిల్లల సంక్షేమానికి సంబంధించిన హెల్త్ క్యాంప్లు, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ నుంచి మెహతా 2006 నుంచి 2010 వరకు తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. తాజాగా ఆమె కొత్తగా ఎన్నికైన నేపాల్ ప్రభుత్వంలో మార్చి 27న దేశ ఆరోగ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇది ఆరోగ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాలు
దేశంలోని పౌరులకు సరసమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి రూపొందించిన నేపాల్ ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా కార్యక్రమం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొత్తగా ఆరోగ్య మంత్రిగా ఎన్నికైన నిషా మెహతాకు ఈ బీమా పథకాన్ని సంస్కరించడం అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని మాజీ ఆరోగ్య కార్యదర్శి టంకా బరకోటి సూచించారు. ఈ కార్యక్రమానికి సమూల పునర్వ్యవస్థీకరణ అవసరమని బరకోటి తెలిపారు. నేపాల్ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమానికి రూ.10 బిలియన్లు కేటాయించింది. గత సంవత్సరం నుంచి ఉన్న బకాయి చెల్లింపులను పరిష్కరించడానికి సుమారు రూ.11 బిలియన్లు అవసరమయ్యాయి. ఆరోగ్య బీమా బోర్డు నివేదికల ప్రకారం.. ప్రభుత్వం దీనికి అదనంగా రూ.1 బిలియన్ గ్రాంటును అందించినప్పటికీ, ఆ మొత్తం డబ్బు పాత బకాయిలను చెల్లించడానికే ఖర్చయిపోయింది. ప్రీమియం వసూళ్లు సుమారు రూ.3.5 బిలియన్లకు చేరగా, ఈ కార్యక్రమంపై నెలకు సుమారు రూ.2 బిలియన్లు, సంవత్సరానికి రూ.24 బిలియన్ల వ్యయం అవుతోందని అంచనా. స్థిరమైన నిధులు లభించకపోతే, ఈ కార్యక్రమం కొనసాగలేకపోవచ్చని అధికారులు హెచ్చరించారు.