NTV Telugu Site icon

Ind vs Nz: న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్

Ind Vs Nz

Ind Vs Nz

Ind vs Nz: హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. సంజూ శాంసన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ల స్థానంలో దీపక్‌ హుడా, దీపక్‌ చాహర్‌లను తీసుకురావడంతో భారత్‌ రెండు మార్పులు చేసింది. ఆదివారం జరిగే మూడు వన్డేల సిరీస్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతోంది. మొదటి వన్డేలో బ్లాక్‌క్యాప్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టామ్ లాథమ్ 104 బంతుల్లో 145 నాటౌట్‌గా నిలవడంతో కివీస్ తొలి వన్డేలో భారత్‌పై 307 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్ సిరీస్‌ ఫలితంతోపాటు ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌ పాయింట్లపైనా ప్రభావం చూపనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే సిరీస్‌ రేసులో నిలబడుతుంది. ఒక వేళ ఓడితే మాత్రం సిరీస్‌తోపాటు సూపర్‌ లీగ్‌లో రెండో స్థానానికి పడిపోవడం ఖాయం. తొలి వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. 300కిపైగా పరుగులు సాధించినా కాపాడుకోవడంలో బౌలర్లు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. అయితే తొలి వన్డేలో పరాజయం పాలైనప్పటికీ ఐసీసీ వరల్డ్‌ కప్‌ సూపర్ లీగ్‌ పాయింట్ల టేబుల్‌లో భారత్‌ స్థానం మాత్రం మారలేదు. అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో మళ్లీ న్యూజిలాండ్‌ గెలిస్తే మాత్రం టీమ్‌ఇండియా రెండో స్థానానికి పడిపోవడం ఖాయం. అలాగే సిరీస్‌ కూడా కివీస్‌ సొంతమవుతుంది. ప్రస్తుతం భారత్‌ 19 మ్యాచుల్లో 13 విజయాలు, 6 ఓటములతో 129 పాయింట్లు సాధించింది. ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఒక్క విజయానికి పదేసి పాయింట్లు వస్తాయి.

China Covid: భగ్గుమన్న షింజియాంగ్.. భారీ స్థాయిలో నిరసనలు

ఈ లెక్కన టీమ్‌ఇండియా ఖాతాలో 130 పాయింట్లకు బదులు 129 మాత్రమే ఉండటానికి కారణం పెనాల్టీ ఓవర్‌. ఎన్ని పెనాల్టీ ఓవర్లు వేస్తే అన్ని పాయింట్లు కోత పడతాయి. అలాగే మ్యాచ్‌ రద్దు అయితే ఇరు జట్లకూ చెరో ఐదేసి పాయింట్లు వస్తాయి. ఈ క్రమంలో భారత్‌కు ఒక పెనాల్టీ ఓవర్‌ ఉండటంతో ఒక పాయింట్‌ తగ్గింది. మరోవైపు న్యూజిలాండ్ 16 మ్యాచుల్లో 12 విజయాలు, నాలుగు ఓటములతో 120 పాయింట్లతో ఉంది. ఒక వేళ రెండో వన్డేలో కివీస్‌ విజయం సాధిస్తే.. అప్పుడు 130 పాయింట్లకు వెళ్లిపోతుంది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న భారత్‌ రెండో స్థానానికి పడిపోతుంది. ఐసీసీ పాయింట్ల పట్టికలో టాప్‌-8 జట్లు భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన ఐదు జట్లు క్వాలిఫయిర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈసారి 13 జట్లు బరిలోకి దిగబోతున్నాయి.