స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. మొత్తం 12మంది ఐఏఎస్ అధికారుల్ని విచారించాలని సీఐడీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని ఐఏఎస్ అధికారుల్ని విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ సీఐడీకి న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అజయ్ కల్లం, అజయ్ జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మీ, ప్రేమ్ చంద్రారెడ్డి, సిసోడియా, కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతిక శుక్లా, అర్జా శ్రీకాంత్, జీ.జయలక్ష్మీలను విచారించాలని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డిపై కూడా ఫిర్యాదు చేశారు.
Read Also: World Cup 2023: ఈ వరల్డ్కప్లో ఇదే భారీ సిక్సర్.. అయ్యర్ అయ్యారే అనిపించాడు..!
ఇక, అప్పటి సీఎండీ బంగారు రాజులతో పాటు కార్పొరేషన్ లోని సీఎఫ్ఓ, సీఈవో, ఈడీలను విచారించాలని ఫిర్యాదుదారు కోరారు. స్కిల్ కేసులో ఐఏఎస్ అధికారుల్ని ఎంక్వైరీ చేయాలని సీఐడీని కోరాం.. సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీలో సభ్యులుగా ఉన్న ఐఏఎస్ అధికారులను విచారించాల్సిందిగా ఫిర్యాదు చేశామని న్యాయవాది ప్రసాద్ చెప్పుకొచ్చారు. విచారణ ప్రారంభమైన తర్వాత కూడా ఐఏఎస్ అధికారులను అక్యూజ్డ్ లిస్టులో చేర్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వైఎస్ హయాంలో జరిగిన కుంభకోణాల విషయంలో ఇదే జరిగింది అని తెలిపారు.
Read Also: Atchannaidu: చంద్రబాబుపై అక్రమ కేసు సిగ్గనిపించటం లేదా?
ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో 27 కోట్ల రూపాయలు టీడీపీకి వచ్చాయని సీఐడీ ఆరోపిస్తోంది. గోప్యంగా ఉండాల్సిన ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలు సీఐడీకి ఎలా తెలిశాయన్న అంశంపైనా విచారణ చేయించమని ఫిర్యాదుదారు తరపు అడ్వకేట్ వజ్జా శ్రీనివాస్ కోరారు. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయాలని సీఐడీ ఏడీజీకి ఫిర్యాదు చేశామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు సెంటర్లు అద్భుతంగా పని చేస్తున్నాయని ప్రస్తుత ఛైర్మన్ అజేయ్ రెడ్డి ప్రకటనలు ఇస్తున్నారు.. స్కిల్ సెంటర్లు అసలు పని చేయడం లేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు.. పని చేయని స్కిల్ సెంటర్లు పని చేస్తున్నట్టుగా అజేయ్ రెడ్డి చెబుతున్నారా?.. స్కిల్ సెంటర్ల పేరుతో డబ్బులు పక్క దారి పట్టించారేమోననే అనుమానంతో అజేయ్ రెడ్డిని విచారించాల్సిందిగా న్యాయవాది ప్రసాద్ కోరారు. అయితే, ఫిర్యాదు చేయడానికి సీఐడీ కార్యాలయానికి వెళ్తే సరిగ్గా పట్టించుకోలేదు అని న్యాయవాది ప్రసాద్ తెలిపారు. ఫిర్యాదును సీఐడీ చీఫ్ కు మెయిల్ చేశాం.. రిజిస్టర్ పోస్టులోనూ పంపాం.. మా ఫిర్యాదును స్వీకరించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఫిర్యాదుదారు తరపు అడ్వకేట్ వజ్జా శ్రీనివాస్ వెల్లడించారు.