Site icon NTV Telugu

AP Crime: హృదయ విదారకం.. భర్త దారుణ హత్యను చూసి భార్య గుండెపోటుతో మృతి

Ap Crime

Ap Crime

AP Crime: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన 59 ఏళ్ల భర్త దారుణ హత్యను చూసిన అనంతరం 56 ఏళ్ల వయస్సు గల భార్య ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించింది.మరణించిన భార్యాభర్తలిద్దరినీ మూర్తి రావు గోఖలే, శోభా గోఖలేగా గుర్తించారు. అనంతపురం వన్‌టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రెడ్డెప్ప తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌ ఎదురుగా ఉన్న ఎల్‌ఐసీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మూర్తి రావు గోఖలే ఎస్కే విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. మృతుడు మూర్తి రావు గోఖలే మేనల్లుడు ఆదిత్యను హంతకుడిగా పోలీసులు గుర్తించారు.

Read Also: Citizenship Amendment Act: సీఏఏ అంటే ఏమిటీ?.. అమలు తర్వాత ఏ మార్పులు జరుగుతాయంటే?

అసలేం జరిగిందంటే.. ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆదిత్య.. ప్రముఖ కంపెనీలో ప్లేస్‌మెంట్ ఇప్పిస్తానంటే తన మామ మూర్తిరావు గోఖలేకు లంచం ఇచ్చాడు. దీని తరువాత, మూర్తి రావు గోఖలే తన మేనల్లుడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడు. అంటే ఆదిత్యకి ఆ కంపెనీలో ఉద్యోగం రాలేదు. దీని తర్వాత గోఖలే ఆదిత్య కాల్స్‌ని తీయడం మానేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆదిత్య తన మామను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఆదిత్య పథకం వేసి ఆదివారం రాత్రి గోఖలే ఇంటికి చేరుకుని అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వాగ్వాదం ఎంతగా ముదిరిందంటే.. ఆదిత్య గోఖలేపై కత్తితో దాడి చేశాడు. గోఖలే గొంతు కోసి, అతని శరీరంపై కత్తులతో పలుమార్లు పొడిచాడు, ఫలితంగా అతను అక్కడికక్కడే మరణించాడు.

ఇంట్లోనే ఉన్న గోఖలే భార్య శోభ తన భర్తను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించగా.. ఆదిత్య ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. అయితే భర్త దారుణ హత్యను చూసిన శోభ కొన్ని గంటలకే గుండెపోటుకు గురై మరణించింది. అనంతపురం టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ఆదిత్యను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

Exit mobile version