NEET-UG 2026: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో అరెస్టయిన 13 మంది నిందితులపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నిందితులపై నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, సాక్ష్యాధారాల ధ్వంసం తదితర భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనలతో పాటు.. అవినీతి నిరోధక చట్టం కింద నేరపూరిత ప్రవర్తన, అలాగే ప్రజా పరీక్షలు (అన్యాయ మార్గాల నివారణ) చట్టం–2024 కింద కేసులు నమోదు చేసింది.
ఈ ఛార్జ్షీట్లో సీబీఐ 360 మంది సాక్షులను, 422 పత్రాలను, 43 భౌతిక ఆధారాలను పొందుపరిచింది. ప్రస్తుతం ఛార్జ్షీట్లో పేరున్న 13 మంది నిందితులు కస్టడీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 2026 మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ జరిగిందన్న ఆరోపణలపై 2026 మే 12న కేంద్ర ఉన్నత విద్యా శాఖ సీబీఐకి లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అదే రోజు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 72 మంది అధికారులు, సిబ్బందితో పాటు 8 మంది సైబర్ ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లోని 92 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో డిజిటల్ పరికరాలు, కమ్యూనికేషన్ డివైస్లు, కీలక పత్రాలు తదితర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై ఫోరెన్సిక్ విశ్లేషణ చేపట్టారు. కేసు నమోదైన కొద్ది వారాల్లోనే ప్రశ్నాపత్రం లీక్ మూలాన్ని గుర్తించి, లీక్ నుంచి లబ్ధిదారుల వరకు ఉన్న మొత్తం వ్యవస్థను సీబీఐ వెలికితీసింది. ఈ కేసులో తొలి అరెస్టు 2026 మే 13న జరిగింది.
మొత్తం 13 మందిని అరెస్టు చేయగా.. వారిలో ఎన్టీఏకు చెందిన కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు ముగ్గురు ఉన్నారు. ప్రశ్నాపత్రాలను సేకరించి పంపిణీ చేసిన పలువురు మధ్యవర్తులను కూడా గుర్తించి అరెస్టు చేశారు. అలాగే లీకైన ప్రశ్నాపత్రాలను నిపుణుల నుంచి పొందిన రెండు కోచింగ్ సెంటర్లకు చెందిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల ఆర్థిక లావాదేవీలపై కూడా సీబీఐ దర్యాప్తు చేపట్టి, పలు బ్యాంకు ఖాతాలు, బ్యాంకు లాకర్లు, ఒక డీమ్యాట్ ఖాతాను స్తంభింపజేసింది.
డిజిటల్ ఫోరెన్సిక్ నివేదికలు, చేతిరాత నిపుణుల అభిప్రాయాలు, విద్యా నిపుణుల విశ్లేషణల ద్వారా పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాల చలామణిలో నిందితుల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయిందని సీబీఐ వెల్లడించింది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు, ఫోరెన్సిక్ విశ్లేషణ కొనసాగుతోందని, పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీసే ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీబీఐ స్పష్టం చేసింది.

