Delhi: నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం, దేశ విద్యావ్యవస్థలో జరుగుతున్న లోపాలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వేదికగా ఒక భారీ ఉద్యమం మొదలైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే పిలుపునిచ్చిన జంతర్ మంతర్ శాంతియుత నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అధికారికంగా అనుమతి ఇచ్చారు. శనివారం ఉదయం నుంచే జంతర్ మంతర్ వద్దకు యువత భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన కార్యక్రమం కొనసాగనుంది. కాక్రోచ్ మాస్కులతో యూత్ తరలిరావడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ఈ నిరసన ప్రదర్శనను అడ్డుకోవాలంటూ దాఖలైన ఒక పిటిషన్పై అత్యవసర విచారణ జరపడానికి ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. జస్టిస్ సౌరభ్ బెనర్జీ, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ను సాధారణ సమయాల్లోనే విచారిస్తామని స్పష్టం చేయడంతో ఈ ఉద్యమానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. ఈ క్రమంలోనే, శనివారం ఉదయం 9 గంటలకు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల శాంతియుతంగా గుమిగూడాలని సిజెపి తన మద్దతుదారులకు పిలుపునిచ్చింది.
ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న అభిజీత్ దిప్కే అమెరికాలోని బోస్టన్ నగరం నుంచి శనివారం ఉదయమే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. తాను జూన్ 6న భారత్కు తిరిగి వచ్చి విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం ఉద్యమిస్తానని ఈ వారంలోనే ప్రకటించారు. దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ, “ల్యాండింగ్ పూర్తయింది, జంతర్ మంతర్ వద్ద మీ అందరినీ కలవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మీతో పాటు ఒక పుస్తకాన్ని, మన జాతీయ జెండాను తీసుకురావడం మర్చిపోవద్దు. మనకు రక్షణగా ఉండే పోలీసులపై గౌరవంతో వారికి పూలు కానుకగా ఇవ్వండి. ప్రేమ, శాంతి మార్గంలోనే మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి” అని పిలుపునిచ్చారు. ఈ వినూత్న ఉద్యమానికి ప్రముఖ విద్యా సంస్కర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ కూడా తన మద్దతు ప్రకటించారు. జూన్ 5 లోగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే తాను కూడా ఈ నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొంటానని ఆయన ముందే ప్రకటించడం గమనార్హం.

